న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం అభాసు పాలయ్యేలా బీజేపీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే బెంగాల్ లో పవర్ ను కోల్పోయింది టీఎంసీ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో సక్సెస్ అయ్యింది. మంగళవారం టీఎంసీ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు ఉన్నట్టుండి తిరుగుబాటు జెండా ఎగుర వేశారు. తాము ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అంతే కాదు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీఏ కు మద్దతు ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇన్ని రోజులుగా ఈ ఎంపీలపై బిజెపి చేసిన విమర్శలు, చేసిన కేసులు అన్నీ గాలిలో కలిసి పోయాయి.
బిజెపిలో చేరితే అనర్హతకు గురవుతామనే కారణంతో కనీసం వెయ్యి ఓట్లు కూడా సాధించలేని ఎన్సిపి(ఐ) పార్టీలోకి బిజెపి వారిని పంపింది. ఇదే క్రమంలో తిరుగుబాటు టీఎంసీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలోని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో కలిశారు. అనంతరం తిరుగుబాటు టీఎంసీ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తిదార్ మాట్లాడారు. ఏఐటీసీ నుంచి ఎన్నికైన మేము, ఇరవై మంది ఎంపీలం, స్పీకర్ను కలిసి విడిగా కొనసాగేందుకు అనుమతి కోరుతూ ఒక లేఖను సమర్పించామని చెప్పారు. ఈ ఇరవై మంది ఎంపీలే మా మొత్తం బలంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ అని పేర్కొన్నారు. తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో విలీనం అవుతున్నామని చెప్పారు. ఇకపై తాము దేశం కోసం పనిచేస్తామని, సమర్థవంతమైన నాయకుడైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏలో కలిసి పని చేస్తామని ప్రకటించారు.
