ఖమ్మం జిల్లా : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా సంకల్పం అని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కాదు, అభివృద్ధే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. మధిర సమగ్ర అభివృద్ధికి అవసరమైన అనేక పనులకు ఇప్పటికే అనుమతులు తీసుకు వచ్చాం అని చెప్పారు భట్టి విక్రమార్క. ఆ పనులు నాణ్యతతో, ప్రణాళికా బద్ధంగా అమలు కావాలంటే మంచి పాలకవర్గం అవసరం అని నొక్కి చెప్పారు. అందుకే కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మధిర నగరంలో ఇవాళ ఎన్నికల ప్రచారం ఆఖరు రోజు కావడంతో విస్తృతంగా పర్యటించారు.
ఎన్నికల అనంతరం అన్ని వర్గాల ప్రముఖులతో రాజకీయాలకు అతీతంగా మధిర పట్టణ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు మల్లు భట్టి విక్రమార్క. వారి సూచనలతో పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇండస్ట్రియల్ పార్కులో స్థలాల కేటాయింపు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ వంటి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే భారీ ఎత్తున మధిర పట్టణాభివృద్ది కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించడం జరిగిందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం.
