కర్నూలు జిల్లా : ఏపీ మంత్రి టీజీ భరత్ గుప్తా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో యువత ఉపాధి ఉద్యోగాల కోసం ఏపీ కూటమి సర్కార్ కృషి చేస్తోందన్నారు. శనివారం కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో జాబ్ మేళాను ప్రారంభించారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి.19 కంపెనీల్లో 1460 ఉద్యోగాలకు జాబ్ మేళా పెట్టాం అన్నారు. ఈ మేళాలను యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఒక్కరికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం అని ప్రకటించారు టీజీ భరత్.
20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు . సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఉద్యోగాలు సృష్టించేందుకు కష్టపడుతున్నాం అన్నారు మంత్రి .ఓర్వకల్లుకు గతంలో ఎప్పుడు లేనంతగా కంపెనీలు తెస్తున్నామని చెప్పారు. రిలయన్స్, అగస్త్య కంపెనీలను కర్నూలుకు తీసుకొచ్చాం అన్నారు. .జైరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీ మరో 6 వేల కోట్ల పెట్టుబడిని పెడుతోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు టీజీ భరత్. వీటి ద్వారా వేలాది ఉద్యోగాలు దక్కుతాయని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కమిటీ చైర్మన్ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఉద్యోగాలు సృష్టిస్తున్నాం అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలు అమలైతే ప్రపంచంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ఇప్పటికే దేశంలోకి వచ్చే 25 శాతం పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయని తెలిపారు.
