కావేరీ జల వివాదంపై సీఎం డీకే శివకుమార్ సమీక్ష
కర్ణాటకతో చర్చలకు వద్దంటున్న తమిళనాడు రైతులు
బెంగళూరు : గత కొంత కాలంగా తీవ్ర వివాదానికి దారి తీసింది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న కావేరీ జల వివాదం. ఇప్పటికే సీఎం డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సిద్దమయ్యారు. తేదీ, టైం కూడా ఖరారు చేశారు. కానీ ఇందుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా . రైతులతో పాటు ప్రతిపక్ష, అధికార పక్షంలో భాగస్వామ్యం పంచుకున్న పార్టీల నేతలు కూడా అభ్యంతరం తెలిపారు. సీడబ్ల్యూసీ, కావేరీ నీటి వివాదాల కమిషన్ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన మేరకు 41 టీఎంసీల నీళ్లను తమిళనాడుకు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆదివారం బెంగలూరులో కీలకమైన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎం డీకే శివకుమార్ అధ్యక్షత వహించారు.
ఇదిలా ఉండగా తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో, ఈ వివాదంపై రాష్ట్ర చట్టపరమైన , రాజకీయ వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కావేరీ పరీవాహక ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు , సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొని, ఈ అంశంపై కర్ణాటక వైఖరిని చర్చిస్తారు. సీడబ్ల్యూఆర్సీ జారీ చేసిన ఆదేశాలకు వ్యతిరేకంగా కర్ణాటక అంతటా విస్తృత నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ సమావేశం జరిగింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయకూడదని బీజేపీ, రైతు సంఘాలు , కన్నడ అనుకూల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆగస్టు 3న జరగాల్సి ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రితో సమావేశాన్ని శివకుమార్ వాయిదా వేశారు.
