విజయవాడ : రాష్ట్ర పండుగగా ఇవాళ ప్రభుత్వం విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి జరుపుతున్నామని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. సవిత. శిల్పులు, వృత్తి నిపుణులు, కార్మికులకు ఆరాధ్యై దైవం విశ్వకర్మ భగవానుడు అని పేర్కొన్నారు. గురువారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విశ్వకర్మ భగవానుడి జయంతి నిర్వహించారు. విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విశ్వకర్మ భగవానుడి బాటలో కూటమి ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. చేతి వృత్తులకు అండగా సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని పేర్కొన్నారు. గీత, వడ్డెర, చేనేత, ఇతర వృత్తులకు ఆర్థిక మేలు చేకూరేలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. లంకానగరం, ద్వారక, ఇంద్రప్రస్థం వంటి అద్భుత నగరాలను నిర్మించిన చరిత్ర విశ్వకర్మ అని చెప్పారు ఎస్. సవిత.
ఆధునిక విశ్మకర్మ సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ఇదిలా ఉండగా విశ్వకర్మ జయంతిని ప్రతి సంవత్సరం భగవాన్ విశ్వకర్మను స్మరించుకుంటూ నిర్వహిస్తారు. విశ్వకర్మను హిందూ సంప్రదాయంలో దేవతల దివ్య శిల్పి, వాస్తుశిల్పి , నిర్మాణకర్తగా భావిస్తారు. ఇంజనీర్లు, కార్మికులు, శిల్పులు, మెకానిక్లు, తయారీ రంగం, నిర్మాణ రంగానికి చెందిన వారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. దేశ వ్యాప్తంగా ఇవాళ విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు. జయంతి రోజు ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, మెకానిక్లు, కార్పెంటర్లు, వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఫ్యాక్టరీ కార్మికులు, కళాకారులు, చేతివృత్తుల వారు తదితరులు ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.
