హైదరాబాద్ : తెలంగాణకే తలమానికంగా నిలిచిన సికింద్రాబాద్ లోని శ్రీ మహంకాళి అమ్మ వారి బోనాలు ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పూలు, విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవోపేతంగా అమ్మ వారిని అలంకరించారు. శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరడంతో ఆలయం వద్ద పొడవైన క్యూ లైన్లు కనిపించాయి. ఆదివారం సికింద్రాబాద్లోని చారిత్రక శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రారంభమైన రెండు రోజుల బోనాల వేడుకలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. స్థానిక నివాసితుల సంక్షేమ సంఘాలు , యువజన సంఘాలు వీధులను రంగురంగుల పూలు, ఎల్ఈడీ దీపాలతో అలంకరించడంతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
శ్రీ మహంకాళి అమ్మ వారికి ‘బోనం’ సమర్పించే మహిళలకు, సాధారణ భక్తులకు దేవాదాయ శాఖ ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసింది. పట్టు చీరలు ధరించిన మహిళలు ఆలయానికి వచ్చి, తమ కోరికలు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా పసుపు, కుంకుమలతో అలంకరించిన కుండలో బెల్లం కలిపిన అన్నంతో చేసిన ‘బోనం’ను అమ్మ వారికి సమర్పించేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని పూజలు చేశారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. అనంతరం మీడియాతో మాట్లాడారు. బోనాల పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు 2,500 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. అనుమానాస్పదంగా తిరిగే వారిని, జేబు దొంగలను పర్యవేక్షించడానికి మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగిస్తున్నామని చెప్పారు. ఈవ్-టీజర్స్ పై నిరంతరం నిఘా ఉంచడానికి తగిన సంఖ్యలో షీ టీమ్స్ ను కూడా రంగంలోకి దించామన్నారు వీసీ సజ్జనార్.
