ఖమ్మం జిల్లా : వైరా పట్టణం అభివృద్ది కోసం రూ. 200 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైరా పట్టణంలో భారీ ర్యాలీ మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో పాటు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , డీసీసీ నూతి సత్యనారాయణ గౌడ్ , ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు కేవలం ఓటింగ్ కార్యక్రమం కాదని, వైరా భవిష్యత్తును నిర్ణయించే తీర్పు అని పేర్కొన్నారు. అభివృద్ధి దిశగా ముందుకు సాగాలా, లేక గత నిర్లక్ష్య పాలనను కొనసాగించాలా అన్నది ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ హయాంలోనే వైరాలో అభివృద్ధి జరిగిందని చెప్పారు అనుముల రేవంత్ రెడ్డి. రూ.200 కోట్లతో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి, జూనియర్ కాలేజీ, ఐటీఐను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్గా అభివృద్ధి చేయడం, పాలిటెక్నిక్ మంజూరు వంటి కార్యక్రమాలు వైరా భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారనుందని చెప్పారు. చిన్న వ్యాపారుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాలువల లైనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వైరాను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించాలని ప్రజలను కోరారు రేవంత్ రెడ్డి.
