PM Narendra Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ

అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ

PM Narendra Modi : యోగా అనేది కేవలం వ్యక్తిగత ఆరోగ్యం గురించి మాత్రమే కాదని, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ఐక్యతా స్ఫూర్తిని నెలకొల్పడానికి కూడా తోడ్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంపై దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సందేశంతో కూడిన లేఖను విడుదల చేసారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ యోగా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన ఈ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

PM Narendra Modi Key Comments on International Yoga Day

ప్రధాని మోదీ (PM Narendra Modi) విడుదల చేసిన లేఖలో… ఈ సంవత్సరం జూన్ 21న మనం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ఘనంగా జరుపుకోనున్నామని తెలిపారు.ఈ చారిత్రాత్మక యోగా ప్రస్థానం విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గత దశాబ్ద కాలంగా దేశ ప్రజలు ఈ గొప్ప కార్యక్రమానికి అందిస్తున్న ఆదరణ ఒక ప్రత్యేకమన్నారు.గత పదేళ్లుగా యోగా కేవలం భారత దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావాన్ని చూపడం మనందరికీ గర్వకారణమన్నారు.

ఈ ఎడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని “యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం” (Yoga for One Earth, One Health) అనే థీమ్ తో ముందుకు వెళ్తున్నామన్నారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానవత్వం,పర్యావరణ పరిరక్షణ,మరియు ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని,ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయ పడుతుందన్నారు. అంతేకాకుండా యోగా సమగ్రమైన,ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.

శారీరకంగా మరియు మానసికంగా సాధికారత పొందిన పౌరులు దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన,ప్రభావవంతమైన పాత్ర పోషిస్తారన్నారు.ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో యోగా ఒక శక్తివంతమైన సాధనమన్నారు.యోగా ద్వారా మనం స్వావలంబన మరియు అభివృద్ధి చెందిన భారతదేశం అనే మన జాతీయ సంకల్పాన్ని మరింత బలంగా,వేగంగా సాధించ గలుగుతామన్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి పంచాయతీ పరిధిలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలని కోరారు.ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా,బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని,ముఖ్యంగా పంచాయితీ భవన్, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పిల్లలు,యువత, మహిళలు మరియు పెద్దలు సహా అన్ని వర్గాల ప్రజలు యోగా వల్ల ప్రయోజనాలు పొంది,ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచు కోగలరన్నారు.అందరం కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంతో ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవడానికి గొప్ప ప్రేరణనిస్తుందని ప్రధాని గట్టిగా విశ్వసిస్తున్నానన్నారు.యోగా ద్వారా వారు మరింత ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.

Also Read : Copenhagen: ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా డెన్మార్క్ రాజధాని కోపెన్‌ హాగన్

Leave A Reply

Your Email Id will not be published!