హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన గాడి తప్పిందని, రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఇవాళ హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి పరిపాలించడం చేత కావడం లేదన్నారు. ఐఎస్ఐ, ఐపీఎస్ లను పూటపూటకు మార్చడం వలన పాలన కుంటు పడుతుందన్నారు. ఒక్క సంవత్సరంలో 5 సార్లు బదిలీలు చేశారని ఇదేం పాలన అంటూ ఎద్దేవా చేశారు. యావరేజ్ గా చూస్తే 6 నుండి 8 నెలలకు ఒక్క హెచ్ఓడి మారాడన్నారు. అత్యంత కీలకమైన విద్యుత్ రంగం చూస్తే 5 అధికారులు మారడం విచిత్రం అన్నారు హరీశ్ రావు. అందుకే విద్యుత్ శాఖ ఆగమాగం అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులను స్థిరంగా ఉండనీయకుండా పదే పదే బదిలీ చేయడం వల్ల విద్యుత్ శాఖ అస్తవ్యస్తం అవుతుందన్నారు. ఆ శాఖను అర్ధం చేసుకునే లోపే బదిలీ అవుతున్నారని పేర్కొన్నారు హరీశ్ రావు. సింగరేణి సంస్థలో కూడా 4 మారారని గుర్తు చేశారు. ఇక కీలకమైన హైదరాబాద్ నగర పాలక సంస్థ లో కూడా ఇదే పరిస్థితి దాపురించిందన్నారు. ఐ అండ్ పీఆర్ లో కూడా 4 అధికారులు మారారని, అందుకే ఇప్పుడు జర్నలిస్టులకు ఆక్రిడిషన్ కార్డులు కూడా రావడం లేదన్నారు. విద్యాశాఖ సెక్రటరీ, స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా ముగ్గురు అధికారుల బదిలీలు అయ్యాయని తెలిపారు. ఆరోగ్య శ్రీలో 8 అధికారులు బదిలీలు అయ్యారని, పేదలకు ఏం వైద్యం అందిస్తారంటూ ప్రశ్నించారు. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఇప్పటి వరకు నలుగురు కలెక్టర్లు మారారని తెలిపారు.
