NDA Meeting : ఎన్డీయే శాసనసభా సమావేశంలో ఇసుకపై సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు...

NDA Meeting : ఇవాళ(సోమవారం) ఏపీ అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే ఎన్డీయేలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పారు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా ఇసుక రీచ్‌లు కట్టబెట్టారని, ఇష్టం వచ్చినట్లు రవాణా చేసి సొమ్ము చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి ఏ ఎమ్మెల్యే, మంత్రి కూడా ఇసుక విషయంలో కలగజేసుకోవద్దని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక రవాణ, లోడింగ్ ధరలు కొంత మేర ఇబ్బందిగా ఉన్నాయని ముఖ్యమంత్రికి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు తెలిపారు. పక్క జిల్లాల నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లల్లో ఉన్న ఇసుక మాత్రమే సరఫరా చేస్తున్నామని, రీచ్‌ల నుంచి తెచ్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు(Chandrababu) వారికి తెలిపారు.

NDA Meeting…

అలాగే పంట వేసిన నెల రోజుల్లో నష్టం వాటిల్లితే తక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నట్లు చంద్రాబాబుకి జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ వర్తించేలా చూసి వారిని కష్టకాలంలో ఆదుకోవాలని కోరారు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనంతో మూడ్రోజులపాటు కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చేసిన సూచనలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ నుంచి ఎక్కువగా నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని, అది ఫలిస్తే కొంత మేర ఇబ్బందులు పరిష్కరించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశంలో వెల్లడించారు.

Also Read : KTR : నూతన వైఖరిపై సర్కారు వైఖరి చెప్పాలంటూ లేఖ రాసిన కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!