Minister Payyavula : మంత్రులు, ముఖ్య కార్యదర్శులతో ఆర్థికమంత్రి కీలక సమావేశం
ప్రవేశపెట్టేబోయే పథకాలను సమీక్షల్లో మంత్రి పయ్యావులకు ఆయా శాఖల మంత్రులు వివరించారు...
Minister Payyavula : ఆంధ్రప్రదేశ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula) వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఇరిగేషన్, ఎక్సైజ్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు చెందిన మంత్రులు.. ఆయా శాఖల కార్యదర్శులతో మంత్రి పయ్యావుల(Minister Payyavula) ప్రీ-బడ్జెటరీ సమావేశాలు నిర్వహించనున్నారు. తమ శాఖలకు కావాల్సిన నిధులను.. ప్రవేశపెట్టేబోయే పథకాలను సమీక్షల్లో మంత్రి పయ్యావులకు ఆయా శాఖల మంత్రులు వివరించారు.
Minister Payyavula Keshav Meet
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులను కేటాయించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు.. పయ్యావులను కోరారు.ప్రాధాన్యతల వారీగా ప్రాజెక్టులకు నిధుల విడుదల చేసే దిశగా ఆలోచన చేస్తామని మంత్రి చెప్పారు. ప్రాధాన్యతల వారీగా ఏయే ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలోననే అంశంపై జాబితా ఇవ్వాలని నిమ్మలను కోరారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణ, గేట్ల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి అవసరమైన బడ్జెట్ ఇవ్వాలని మంత్రి నిమ్మల ప్రతిపాదించారు. అలాగే వివిధ సంక్షేమ శాఖల్లో అమలు చేయాల్సిన పథకాలు వాటికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులపై ఆయా శాఖల మంత్రులు సవిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, ఎన్ఎండీ ఫరూక్ ప్రతిపాదనలు ఇచ్చారు.
కాగా మైనింగ్ శాఖకు అవసరమైన నిధులను కేటాయించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రి పయ్యావుల(Minister Payyavula)ను కోరారు.మైనింగ్ శాఖ నుంచి ఆదాయాన్ని కూడా అదే స్థాయిలో తీసుకురావాలని అధికారులకు మంత్రి సూచించారు. గనుల శాఖ నుంచి వీలైనంత నిధులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి గుర్తు చేశారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుని.. ప్రాధాన్యతల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టాలని కోరారు.కేంద్ర పథకాలతో లింక్ అయ్యేలా పథకాలు.. వాటికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువగా ఫోకస్ పెట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
కాగా మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖపై నిర్వహించిన భేటీకి ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. నీటి ప్రాజెక్టులకు రూ.32 వేల కోట్లు కేటాయించాలని జల వనరుల శాఖ ప్రతిపాదించగా.. అంత పెద్దమొత్తంలో కేటాయింపులు అసాధ్యమని.. ఈ ఏడాదికి రూ.21 వేల కోట్లతో సర్దుకోవాలని నిమ్మలకు పయ్యావుల సూచించారు. ఇందులో పోలవరం ప్రాజెక్టుకు రూ.9,000 కోట్లు, గాలేరు-నగరి, హంద్రీ-నీవాకు చెరో రూ.4,500 కోట్లు, వెలిగొండకు రూ.1,800 కోట్లు ఇస్తామన్నారు. అయితే ఈ కేటాయింపులతో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇతర చిన్న, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను ఎలా చేపడతామని నిమ్మల ప్రశ్నించారు. చాలా ప్రాజెక్టుల పనులు ముందుకు సాగవన్నారు. ప్రాజెక్టుల యాజమాన్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక మంత్రిని కోరారు.
Also Read : CM Chandrababu : ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధానం వేగవంతం చేయాలి