CM Chandrababu : డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఏపీ ఆదర్శం
వికసిత్ భారత్ 2047 సాకారంలో ఏపీ ముందుందని పేర్కొన్నారు...
CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్ 2047 ద్వారా 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పీ 4 ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు బలంగా సంకల్పించామని తెలిపారు. వికసిత్ భారత్ 2047 సాకారంలో ఏపీ ముందుందని పేర్కొన్నారు. ఇవాళ(శనివారం) ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వృద్ధిరేటు, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, రెండో, మూడో శ్రేణి నగరాల అభివృద్ధి వంటి వివిధ అంశాలపై చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు.
CM Chandrababu Key Comments
భారతదేశం ఆర్థిక వ్యవస్థ గత పదేళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుందని, త్వరలోనే 3వ స్థానానికి వెళ్తుందని సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇండియా, జీఎస్టీ, స్టార్టప్ ఇండియా, పీఎం గతిశక్తి, జల జీవన్ మిషన్ వంటి జాతీయ సంస్కరణలు అభివృద్ధికి దోహదం చేశాయని వివరించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న లబ్ధిని ఏపీ ప్రభుత్వం డిజిటల్గా ట్రాక్ చేస్తోందని తెలిపారు. వన్ ఫ్యామిలీ– వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం ద్వారా నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపునకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త వచ్చేలా పాలసీలు తీసుకువచ్చామని, 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు, వన్ డిస్ట్రిక్ట్ వన్పార్క్ను ప్రవేశపెడుతున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏపీలో టెక్నాలజీ అభివృద్ధి చేపడుతున్న కార్యక్రమాలను కూడా సీఎం చంద్రబాబు(CM Chandrababu) సమావేశంలో లేవనెత్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలో బయోమెడికల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా టెక్నాలజీ ఆధారిత అభివృద్ధికి ఏపీ మార్గం వేస్తోందని అన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నామని, విశాఖపట్నం మోడల్ను అమరావతి, తిరుపతి, కర్నూలుకు విస్తరించేలా కేంద్రం సహకరించాలని కోరారు. డిజిటల్ గవర్నరెన్సులో గూగుల్ ఏఐ టెక్నాలజీ వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ క్రియేట్ చేస్తున్నామని వివరించారు. టాటా ఇన్నోవేషన్ హబ్, ఏఐ ఆధారిత పాలన ద్వారా రాష్ట్రం స్టార్టప్లకు, ఉద్యోగ సృష్టికి మార్గదర్శకంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.సర్క్యూలర్ ఎకానమీ, అభివృద్ధి వికేంద్రీకరణ, మిషన్ కర్మయోగి వంటి కార్యక్రమాల ద్వారా సమగ్రాభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తోందని తెలిపారు.
ఏపీ అభివృద్ధికి ఉపకరించే మూడు కీలక అంశాలను గురించి సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రస్తావించారు. పెట్టుబడులు, తయారీ, ఎగుమతులు, ఉద్యోగ సృష్టి వంటి అంశాలపై దృష్టి సారించి, పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం వయోబిలిటీ గ్యాఫ్ ఫండింగ్కు మద్దతుగా ఉండటం ద్వారా జీడీపీ వృద్ధికి దోహదపడుతుందని అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు జనాభా లేమి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయని, తద్వారా అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. కానీ భారతదేశానికి ఉన్న జనాభా కలిసి వచ్చే అంశమని అన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా దేశంలో వృద్దుల శాతాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు, మాతృత్వ సెలవులు పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. అదే విధంగా కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్, డ్రోన్లు, డిజిటల్ ప్లాట్ఫామ్లు వినియోగంతో పాలనలో వేగం పెంచడమే కాకుండా, పౌర సేవలను విరివిగా అందించవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
స్వర్ణ ఆంధ్ర విజన్ 2047 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలతో జాతీయ అభివృద్ధికి దోహదపడేలా ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే నాటికి దేశ లక్ష్యాలకు అనుగుణంగా…మార్గదర్శకత్వం వహించేలా ఏపీ ముందుండి నడవడానికి సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు.
ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన అమాయకులకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. సాయుధ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైందని కొనియాడారు. యుద్ధ వాతావరణం నెలకొన్న సంక్షోభ సమయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధైర్యంగా నాయకత్వం వహించారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశంలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ బ్లూ ప్రింట్ ద్వారా సీఎం చంద్రబాబు వివరించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అధ్యయనం చేయాలని, సీఎం చంద్రబాబు రూపొందించిన ప్రణాళిక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.
Also Read : Shubman Gill : గిల్ మరియు పంత్ కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చిన బీసీసీఐ