Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేత

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు (High Court) తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేసినట్లు ప్రకటించింది. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్‌ అమలు, నామినేషన్ల ప్రక్రియను నిలిపివేసినట్లు తెలిపింది. తదుపరి నోటిఫికేషన్‌ ఇచ్చేవరకు ఎన్నికల ప్రక్రియలన్నీ నిలిపివేసినట్లు ప్రకటించింది.

Local Body Elections in Telangana

హైకోర్టులో (High Court) తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 పై కూడా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విచారణను ఆరు వారాలు వాయిదా వేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గురువారం(అక్టోబర్‌ 9వ తేదీ) హైకోర్టులో విచారణలో భాగంగా ఏజీ సుదర్శన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. ‘ 57.6 శాతం బీసీ జనాభా ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్‌ ఎందుకు?, బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు.

గవర్నర్‌ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగా భావించాల్సి ఉంటుంది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఏజీ సుదర్శన్‌ రెడ్డి. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోలేవు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణాను అనుసరిస్తూ కులం వివరాలను జనగణనలోకి తీసుకోనుంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు.. లోకల్‌ బాడీ ఎన్నికల రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకు సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్ల కోసమే జీవో తెచ్చాం’ అని వివరించారు.

ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం రిజర్వేషన్లు మించకూడదని రాజ్యాంంగంలో ఎక్కడా లేదన్నారు. ‘ తెలంగాణలో ఏ రిజర్వేషన్లు లేని జనాభా 15 శాతం మాత్రమే. ఆ 15 శాతం మందికి 33 శాతం సీట్లు ఇస్తున్నాం’ అని హైకోర్టుకు తెలిపారు. అయితే ప్రభుత్వం తరఫున వాదనలు ముగిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.

Local Body Elections – స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌ అంశంపై తెలంగాణ హైకోర్టు స్టే

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ (Telangana) ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పించడంపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాలకు దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు విధించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ పైనా హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ ఆరు వారాలపాటు నిలిచిపోనుంది.

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండు రోజుల పాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని, స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలోనే జరిగిందని అన్నారు. ఇంటింటికెళ్లి సర్వే చేశారని, ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో బీసీ జనాభా 57.6శాతం ఉన్నట్లు తేలిందన్న ఆయన.. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు కోర్టుకు వివరించారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని గుర్తించే.. అసెంబ్లీ తీర్మానం చేసిందన్నారు.

మరో న్యాయవాది రవివర్మ తన వాదనలు వినిపిస్తూ… రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50శాతం సీలింగ్‌ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారని, 85 శాతం జనాభాకు 42 శాతంతో కలిపి 67 శాతమే రిజర్వేషన్లు ఇస్తున్నామని వివరించారు. 15 శాతం జనాభాకు 33 శాతం ఓపెన్‌గానే ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Bonthu Rammohan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బొంతు

Leave A Reply

Your Email Id will not be published!