విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రముఖ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మంత్రి నారా లోకేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం ప్రసంగించారు. విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నానని, రోజులు మారాయని, సాధారణ మనుషులు అసాధారణ శక్తిగా మారే అవకాశం మనకు ఉందన్నారు సీఎం. నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లపై దృష్టి పెట్టండి అని కోరారు. యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చే విద్యా కేంద్రాలే కాదు… సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలకు వేదిక కావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు.
పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి అని అన్నారు. మీరు ఉద్యోగం చేయడం కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి మీకు రావాలని కోరారు. దీనికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. వీసీని కోరుతున్నా ఏయూకు బ్రాండ్ ఉంది. మీరు అడిగితే ప్రపంచంలోని చాలా యూనివర్సిటీలు మీతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటాయని చెప్పారు సీఎం. వంద దేశాల విద్యార్థులు మన యూనివర్సిటీల్లో చదివేలా సిద్ధం చేయాలన్నారు. సంపద సృష్టించే మార్గదర్శులుగా మారే అవకాశం మీకు ఉందని జోష్యం చెప్పారు. ఎంట్రప్రెన్యూర్లుగా ఏయూ ఎంతమందిని తయారు చేస్తుందనేది మీ మీద ఆధారపడి ఉందన్నారు.
