అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆదివారం సమీక్ష చేపట్టారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆరా తీశారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4,510 అవుట్ లెట్స్ (పెట్రోల్ బంకులు) ఉండగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10 శాతం పెరిగినా , ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని తెలిపారు. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలో లీటర్ల పెట్రోల్, 9048 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయని..అయితే కొరత ఉందనే ఆందోళనతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని వెల్లడించారు.
శనివారం రోజు 10,345 కి.లీ పెట్రోల్, 14,156 కి.లీ డీజిల్ అమ్మకం జరిగినట్లు సీఎంకు వివరించారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50 శాతం అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు అయి పోతున్నాయని పేర్కొన్నారు. ప్యానిక్ కొనుగోళ్ల కారణంగా సరఫరా పెరిగినా వినియోగదారులు అనే చోట్ల బారులు తీరి కొనుగోళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆక్వా రంగంలో డ్రమ్లలో కొనుగోళ్లు జరుపుతారని… వారికి పెట్రో ఉత్పత్తులు విక్రయించే విషయంలో సమస్య తలెత్తుతోందని చెప్పారు. దీనికి పరిష్కారం చూపేందుకు కలెక్టర్లు, ఫిషరీష్ శాఖ అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని సీఎం అధికారులను అదేశించారు. ప్రభుత్వ శాఖలు తీసుకున్న చర్యలు, సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా తనకు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు.
