Jagga Reddy MLA : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను – జగ్గారెడ్డి
కార్యకర్తను లేదంటే భార్యను నిలబెడతా
Jagga Reddy MLA : కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy MLA) షాకింగ్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదంటూ ప్రకటించారు.
కానీ ఎందుకు చేయడం లేదనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా తమ పార్టీకి చెందిన కార్యకర్తను బరిలో దింపుతానని క్యాడర్ ఒప్పుకోక పోతే తన భార్య నిర్మలను పోటీ చేయిస్తానంటూ స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. తాను మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనస్తత్వం కలిగిన వ్యక్తినని చెప్పారు. గతంలో ఆయన భారతీయ జనతా పార్టీతో పాటు టీఆర్ఎస్ లో కూడా ఉన్నారు.
ఆ తర్వాత ఆయా పార్టీలతో పొసగక తిరిగి తన స్వంత గూడైన కాంగ్రెస్ లోకి వచ్చారు. మొదటి నుంచి ధిక్కార స్వరం వినిపిస్తూ హల్ చల్ చేస్తూ వస్తున్నారు.
ప్రధానంగా ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక సీన్ మారిందని, పార్టీ లాగా నడవడం లేదని ఆరోపించారు. ఆయన నేరుగా టీపీసీసీ చీఫ్ ను టార్గెట్ చేయడం, ఆ తర్వాత హై కమాండ్ సీరియస్ కావడంతో ఈ మధ్య తన వాయిస్ తగ్గించారు.
తాను సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ మనిషినని ఇంకొకరికి తాను జవాబుదారీ కానని ప్రకటించారు. ఇదిలా ఉండగా జగ్గారెడ్డి గత కొంత కాలం నుంచీ గాంధీ భవన్ కు రావడం లేదు.
ఎందుకనే దానిపై ఇంకా సమాధానం ఇవ్వలేదు. మరో వైపు పార్టీకి చెందిన సీనియర్లు ఒక్కరొక్కరు వీడుతున్నారు. గుడ్ బై చెబుతున్నారు. రాజ గోపాల్ రెడ్డితో పాటు దాసోజు శ్రవణ్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : తండ్రీ నిన్ను తలంచి – రాహుల్ గాంధీ