Partap Singh Bajwa : సీఎం మాన్ కాన్వాయ్ పై కాంగ్రెస్ కన్నెర్ర
అంతా ఫారిన్ కల్చర్ అన్న విపక్షాలు
Partap Singh Bajwa : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పై నిప్పులు చెరిగాయి విపక్షాలు. విచిత్రం ఏమిటంటే ప్రజల కోసం పని చేస్తామని ప్రగల్భాలు పలికి, మాయ మాటలు చెప్పిన సీఎం ప్రస్తుతం కాన్వాయ్ లో 42 వాహనాలు ఉన్నాయంటూ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పర్తాప్ సింగ్.
పన్ను చెల్లింపుదారులు ప్రజలే. ప్రజల సొమ్మును ఇలా దుర్వినియోగం చేసేందుకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాటలన్నీ అబద్దాలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత లేకుండా పాలన సాగిస్తున్న భగవంత్ మాన్ కు తమను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
ఇంత భారీ ఎత్తున కాన్వాయ్ ఏం అవసరమని ప్రశ్నించారు. భగవంత్ మాన్ ను ఎవరు టార్గెట్ చేశారని ఇలాంటి ఖర్చు చేస్తున్నారంటూ నిలదీశారు పర్తాప్ సింగ్(Partap Singh Bajwa). ఇదంతా వీఐపీ కల్చర్ అని ఎద్దేవా చేశారు. గతంలో పంజాబ్ ను పాలించిన సీఎంల కంటే ఎక్కువగా కాన్వాయ్ లో వాహనాలను కలిగి ఉన్నారని ఆరోపించారు.
సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం తెలిసిందని తెలిపారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రులు ప్రకాశ్ సింగ్ బాదల్ , అమరీందర్ సింగ్ , చరణ్ జిత్ సింగ్ చన్నీలకు ఉన్న కాన్వాయ్ కంటే ప్రస్తుతం కొలువు తీరిన ఆప్ సీఎం భగవంత్ మాన్(Bhagwant Mann) కే ఎక్కువ వాహనాలతో కూడిన కాన్వాయ్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
దీని ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు. ప్రజల చెవుల్లో పూలు పెడుతున్న సీఎంకు త్వరలోనే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమన్నారు. కాన్వాయ్ విషయంలో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం