Tejashwi Yadav : కేంద్రంపై భగ్గుమన్న తేజస్వి యాదవ్
రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఫైర్
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. తన పేరెంట్స్ , సోదరీమణులపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఇదిలా ఉండగా బీహార్ మాజీ సీఎం తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఉద్యోగాల కుంభకోణం ఆరోపణలపై లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు ఆయన భార్య రబ్రీదేవి, ఇద్దరు కూతుళ్లపై సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.
దీనిపై సీరియస్ గా స్పందించారు డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav). సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడం కేవలం బీజేపీ ఆడుతున్న నాటకమన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగడం తప్ప మరొకటి కాదన్నారు. బీహార్ లో బీజేపీ అధికారం కోల్పోవడాన్ని సహించ లేక పోతోందని మండిపడ్డారు తేజస్వి యాదవ్.
ఇదిలా ఉండగా బీహార్ లో గత 17 ఏళ్లుగా జేడీయూ చీఫ్ ప్రస్తుత సీఎం నితీశ్ కుమార్ తో జత కట్టింది. ఉన్నట్టుండి నితీశ్ బీజేపీకి రాం రాం చెప్పారు. ఆ తర్వాత కేవలం ఒక్క రోజులోనే ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ, ఇతర పార్టీలతో కలిసి మహా సంఘటన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో సుదీర్ఘ బంధానికి తెర దించడంతో మోదీ త్రయం తట్టుకోలేక పోతోందంటూ ధ్వజమెత్తారు తేజస్వి యాదవ్. తమను ఎదుర్కొనలేక బీజేపీ ఇలా కేంద్ర సంస్థలతో ఫాల్స్ కేసులు నమోదు చేయిస్తోందంటూ ఆరోపించారు.
Also Read : ప్రకటనలకే ఢిల్లీ సర్కార్ పరిమితం – ఎల్జీ