Bandi Sanjay : నోటిఫికేషన్ల జాతర కొలువులు ఎక్కడ
తెలంగాణ సర్కార్ ను నిలదీసిన బండి
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇంత కాలం ఎందుకు పోస్టులను భర్తీ చేయలేదని నిలదీశారు. కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ప్రస్తుతం నోటిఫికేషన్ల డ్రామా ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ అయినా భర్తీ చేశారా అని ప్రశ్నించారు బండి సంజయ్(Bandi Sanjay). పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు పేరుతో మీరు చేసిన నిర్వాకం వల్ల ఎంతో మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని రూల్స్ ఇక్కడే ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో దాదాపు 2 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయని తమ ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీనే చెప్పిందని , కానీ కేవలం 82 వేలు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అసలు కేసీఆర్ కు ఉద్యోగాలు భర్తీ చేయాలన్న సోయి లేదన్నారు. ఎంత సేపు మద్యం పేరుతో దండుకోవడం, కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేయడం తప్ప ఆయన తెలంగాణకు చేసింది ఏమీ లేదన్నారు బండి సంజయ్(Bandi Sanjay).
కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను జాగీరుగా భావిస్తోందన్నారు. ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలతో పాటు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను దారి మళ్లించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్. రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చేందుకే బీఆర్ఎస్ కేంద్ర నిధుల విషయంలో డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
Also Read : 26 నుంచి రేవంత్ పాదయాత్ర