Samatha Kumbh 2023 : అంగరంగ వైభోగం డోలోత్సవం
దివ్య సాకేతం పోటెత్తిన భక్తజనం
Samatha Kumbh 2023 : శంషాబాద్ లోని ముచ్చింతల్ వద్ద కొలువు తీరిన దివ్య సాకేతం క్షేత్రం జై శ్రీమన్నారాయణ మూల మంత్రంతో మారు మ్రోగుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. పూజలలో నిమగ్నమై ఉన్నారు.
లోక కళ్యాణం కోసం జగత్ గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో సాకేత్ కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈనెల 14 దాకా కొనసాగుతున్నాయి. రోజూ వారీగా పూజలు , తీర్థ గోష్టి , ప్రసాద వితరణ కొనసాగుతూ ఉన్నది.
తెలుగు రాష్ట్రాల తో పాటు దేశం నలుమూలలు, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తున్నారు. స్వామి వారు అందించే తీర్థం కోసం బారులు తీరుతున్నారు భక్తులు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 7న మంగళవారం ఉదయం 11.30 గంటలకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో డోలోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు హనుమద్వాహన సేవతో పాటు 18 గరుడ సేవలు నిర్వహించారు. అనంతరం తీర్థ, ప్రసాదం అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఇక సాకేత్ కుంభ్ ఉత్సవాలలో(Samatha Kumbh 2023) భాగంగా ఫిబ్రవరి 8న బుధవారం ఉదయం 11. 30 గంటలకు కళ్యాణోత్సవంతో పాటు సామూహిక పుష్పార్చన. మధ్యాహ్నం 1.30 గంటల నుండి 4.30 గంటల వరకు భగవద్గీతలో సూపర్ మెమోరీ టెస్టు నిర్వహిస్తారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
Also Read : భక్త బాంధవుడు నారాయణుడు