Pawan Kalyan: పంద్రాగస్టు వేడుకలు వేళ పంచాయితీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ !

పంద్రాగస్టు వేడుకలు వేళ పంచాయితీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ !

Pawan Kalyan: స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయితీలకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామగ్రామాన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలనిలని ఆదేశించారు. ఈ వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచుతున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు ప్రస్తుతం అధికారికంగా ఇస్తున్న రూ.100, రూ.250 మొత్తాలను ఏకంగా రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకూ ఇదే విధంగా నిధులు ఇస్తామన్నారు.

Pawan Kalyan Comment

‘‘ప్రతీ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. పంచాయతీల్లో ఆగస్టు 15న వేడుకల నిర్వహణకు ఇచ్చే మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నాం. ఇప్పటి వరకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా ఆధారంగా 5 వేలులోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.10 వేలు, 5 వేలు పైబడి జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 వేలు అందిస్తాం’’ అని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వివరించారు.

‘‘పంద్రాగస్టున పాఠశాలల్లో డిబేట్‌, క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి.. బహుమతులు ఇవ్వాలి. ఆగస్టు 15న పాఠశాలల్లో స్వాతంత్య్ర సమరయోధులను, రక్షణ రంగంలో పని చేసిన వారిని, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించాలి. పిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలి’’ అని ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ శుక్రవారం కీలక ప్రకటన విడుదల చేసారు.

ప్రభుత్వం కేటాయించే నిధులతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఆదేశించారు. పవన్ కళ్యాణ్‌ను ఇటీవల పలువురు సర్పంచులు కలిసిన సందర్భంలో స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే నిర్వహణ కూడా కష్టంగా ఉందని చెప్పారు. జెండా పండుగను ఘనంగా చేసేందుకు కూడా తగినన్ని నిధులు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందుకు సంబంధించి పంచాయతీలకు ఎంత మొత్తాలు ఇస్తున్నదీ తెలియచేయాలని అధికారులకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. గత 34 ఏళ్లుగా రూ.100, రూ.250 చొప్పునే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఆ స్వల్ప మొత్తాలతో కార్యక్రమాల నిర్వహణ సాధ్యం కాదని, ఈ వేడుకలను పంచాయతీ సర్పంచులు, సిబ్బంది ఘనంగా చేపట్టాలంటే తగిన మొత్తం ఇవ్వాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ స్పష్టం చేశారు. ఆ మేరకు రూ.10 వేలు, రూ.25 వేలు అందజేయాలని నిర్ణయించారు. పంచాయతీల అధ్వర్యంలో ఆగస్టు 15, జనవరి 26 నాటి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలో కూడా మార్గదర్శకాలు జారీ చేశారు. జాతీయ పండుగలైన స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల విశిష్టత ఉట్టిపడేలా కార్యక్రమాల నిర్వహించాలని సూచించారు.

Also Read : Alla Nani: వైసీపీకు మరో షాక్‌ ! పార్టీకు మాజీ మంత్రి ఆళ్ల నాని గుడ్‌ బై !

Leave A Reply

Your Email Id will not be published!