Secunderabad: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో సగం ప్లాట్‌ ఫామ్‌ లు మూసివేత

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో సగం ప్లాట్‌ ఫామ్‌ లు మూసివేత

Secunderabad : సికింద్రాబాద్ రైల్వే‌స్టేషన్ ఆధునీకరణ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ లో ఆరు ప్లాట్‌ ఫామ్‌ లను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. సుమారు 115 రోజుల పాటు ఆరు ప్లాట్‌ ఫామ్‌ లు మూసి వేయనునట్లు అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాడ్ రైల్వే స్టేషన్ కు వచ్చి వెళ్ళే పలు రైళ్ళను… చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకి మళ్లించనున్నారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌(Secunderabad) పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో సగం ప్లాట్‌ఫామ్స్‌ను మూసి వేయనున్నారు. మంగళవారం నుంచి దశలవారీగా 120 జతల రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు.

Secunderabad Railway Station

సికింద్రాబాద్‌(Secunderabad) స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌లో(Railway Station) ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 110 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. ప్రయాణీకులు వేచి ఉండే ప్రాంతంతో పాటు రిటైల్‌ ఔట్‌లెట్స్, రెస్టారెంట్లు, కియోస్క్‌లు లాంటివన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్‌ వంతెనతో అనుసంధానమై ఉంటుంది. ఈ భారీ నిర్మాణానికి సంబంధించిన పునాదులు, కాలమ్స్‌ పనులు మొదలుపెడుతున్నారు.

ఇందుకోసం 2–3, 4–5 ప్లాట్స్‌ ఫామ్స్‌ను 50 రోజులు చొప్పున మొత్తం వంద రోజులపాటు మూసేస్తారు. వీటిల్లో లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటుచేసే పనులు కూడా చేపడుతారు. ప్లాట్‌ ఫామ్స్‌తోపాటు రైల్వే ట్రాక్‌ మొత్తానికి పైకప్పు ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించిన పనులను కూడా ఈ నాలుగు ప్లాట్‌ఫామ్స్‌ తో ప్రారంభిస్తున్నారు. తర్వాత ప్లాట్‌ఫామ్‌ నంబర్‌ 10 వైపు పనులు చేపడుతారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ ఫామ్‌ నుంచి పదో ప్లాట్‌ ఫామ్‌ వరకు భారీ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. దీని పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్‌ పామ్‌ 5–6 లో 500 టన్నుల సామర్థ్యంగల భారీ క్రేన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్‌లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్‌ ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 15 రోజుల పాటు ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌ను మూసేస్తున్నారు.

నిత్యం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మీదుగా 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిల్లో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌ స్టేషన్‌ కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్‌ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 100 రోజుల పాటు సింహభాగం ప్లాట్‌ఫామ్స్‌ ను మూసేస్తుండటంతో 120 జతల రైళ్లను కూడా మళ్లిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్‌లో రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. ఆరు నెలల పాటు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కొనసాగనుంది.

Also Read : Telangana Government: వడదెబ్బ బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Leave A Reply

Your Email Id will not be published!