MP Mithun Reddy: మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎదుట హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
MP Mithun Reddy : మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి… విజయవాడలో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శనివారం ఉదయం విజయవాడ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన్ను దాదాపు 8 గంటల పాటు సిట్ బృందం విచారించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు న్యాయవాది సమక్షంలో మిథున్రెడ్డిని విచారించారు. ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేసి సంతకాలు తీసుకుంది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆరా తీసిన సిట్ అధికారులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది.
మద్యం పాలసీ రూపకల్పన, మిథున్ రెడ్డి(MP Mithun Reddy) ప్రమేయం, డిస్టిలరీ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మద్యం కొనుగోళ్లపై సుదీర్ఘంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డికి చెందిన ఆడాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎంతమేర కొనుగోళ్లు చేసిందని ప్రశ్నించినట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరులు చాణక్య రాజ్, అవినాష్రెడ్డిలతో మిథున్ రెడ్డికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీల గురించి సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
MP Mithun Reddy – ఇప్పుడేమీ మాట్లాడలేను – మిథున్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి తనను వేధిస్తోందని వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి ఆరోపించారు. ఇప్పటి వరకు తమ కుటుంబం ఎన్నో కేసులు పెట్టినా… ఏ ఒక్కటీ నిరూపించలేకపోయిందని ఆయన విమర్శించారు. మద్యం కేసు కూడా రాజకీయ వేధింపుల్లో భాగమేనన్నారు. సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున, ఈ వ్యవహారంలో ఇప్పుడేమీ మాట్లాడలేనని చెప్పారు. నాపై పెట్టడానికి డ్రగ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి’’ అని మిథున్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘మద్యం కేసు తప్పుడు కేసు అని చెప్పగలను. ఈ కేసును ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానంలో కేసు గురించి తేలిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ అంశంపై వివరంగా మాట్లాడతాను’’ అని మిథున్ రెడ్డి చెప్పారు.
Also Read : Smita Sabharwal: పోలీసుల నోటీసులపై “ఎక్స్” వేదికగా స్పందించిన స్మితా సభర్వాల్