Ex DGP Om Prakash: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు
Ex DGP Om Prakash : కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్(68) హత్య కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కోటి వెలుగు చూస్తున్నాయి. బెంగళూరు హెచ్ఎస్ఆర్ లేఔట్ లోని నివాస భవనంలో విశ్రాంత డీజీపీ ఓం ప్రకాష్(Ex DGP Om Prakash) ఆదివారం ఇంట్లో డైనింగ్ టేబుల్ పై చేపల కూరతో భోజనం చేస్తుండగా హత్య చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఓం ప్రకాశ్ నివాసంలో భార్య పల్లవి, కుమార్తె కృతిని హత్య నేరం కింద పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. విచారణలో ప్రధాన నిందితురాలు పల్లవి… తన భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం చల్లి, కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లు ఆమె ఒప్పుకున్నట్లు పోలీసువర్గాలు వెల్లడించాయి. మధ్యాహ్నం ఓంప్రకాష్ చేపల కూరను తెప్పించుకున్నారు. డైనింగ్ టేబుల్ పై ఆరగిస్తుండగా భార్య గొడవకు దిగింది. రగడ తారాస్థాయికి చేరుకుంది, భార్య ఆవేశం పట్టలేక ఓంప్రకాష్ కళ్లలో కారంపొడి చల్లి కత్తితో పొడిచి చంపింది.
Ex DGP Om Prakash Death Shocking Truths
హెచ్ఎస్ఆర్లేఔట్ పోలీసులు వెళ్లగానే కూతురు కృతి తలుపులను లాక్ చేసింది. హత్య చేసింది ఎవరు అని పోలీసులు ప్రశ్నించగా భార్య పల్లవి నేనే అని బదులిచ్చింది. క్రైంసీన్ పరిశీలనలో భోజనం ప్లేట్ డైనింగ్టేబుల్పై కనబడింది. డైనింగ్ హాల్ రక్తసిక్తమైన ఓంప్రకాష్(Ex DGP Om Prakash) శవం పడి ఉంది. కళ్లలో కారంపొడి చల్లిన గుర్తులు కనబడ్డాయి. చాకుతో , బీర్ బాటిల్ తో పొడిచారు. పగిలిన బీర్ బాటిల్ లభించింది. సోమవారం ఉదయం తల్లీకూతురిని హెచ్ఎస్ఆర్ లేఔట్ ఠాణాకు తరలిస్తుండగా గొడవకు దిగారు. మమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు అని కేకలు వేస్తూ జీపు నుంచి దిగలేదు. పోలీసులు సముదాయించి తీసుకెళ్లారు. ఓంప్రకాష్ హత్య కేసు విచారణను మడివాళ ఏసీపీ వాసుదేవ్ కు అప్పగించారు. కాగా, కుటుంబసభ్యులు సంప్రదాయరీతిలో అంత్యక్రియలను నిర్వహించారు.
కర్ణాటకలోని(Karnataka) దండేలిలో ఉన్న భూమి విషయంలో ఓం ప్రకాశ్ దంపతుల మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి వారి మధ్య భోజనం చేస్తున్న సమయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశంతో ఉన్న పల్లవి భర్త ముఖంపై కారం చల్లింది. మంటతో ఆయన విలవిల్లాడుతుండగా ఇదే అదనుగా పలుమార్లు ఆయన్ను కత్తితో పొడిచి చంపేసింది. అనంతరం తన ఫ్రెండ్ కు వీడియో కాల్ చేసి, ‘ఆ రాక్షసుడిని చంపేశాను’అని చెప్పినట్లు విచారణలో వెల్లడైంది.
బిహార్కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్(IPS) అధికారి అయిన ఓం ప్రకాశ్ బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్లోని మూడంతస్తుల సొంతింట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండగా ఆదివారం పోలీసులు గుర్తించడం తెలిసిందే. కొన్ని నెలల క్రితం పల్లవి స్థానిక హెచ్ఎస్ఆర్ లేఔట్(HSR Layout) పోలీస్ స్టేషన్కు వెళ్లి, భర్తపై ఫిర్యాదుకు ప్రయత్నించింది. అధికారులు నిరాకరించడంతో పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. స్కిజోఫ్రీనియా అనే మానసిక వ్యాధితో 12 ఏళ్లుగా బాధపడుతున్న పల్లవి ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోందని సమాచారం. ఇక, ఓం ప్రకాశ్కు ఓ అధ్యాపకురాలితో అక్రమ సంబంధం ఉందని, అది కూడా కుటుంబ కలహాలకు కారణమైందని తెలుస్తోంది.
ఓం ప్రకాశ్ హత్య ఘటనపై ఆయన కుమారుడు కార్తికేశ్ స్పందించారు. తల్లి, సోదరి పైనే ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘వారం రోజులుగా మా నాన్నను చంపేస్తానంటూ మా అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపుల భయంతోనే ఆయన సొంత సోదరి ఇంట్లో ఉంటున్నారు. రెండు రోజుల క్రితం నా సోదరి కృతి అక్కడికి వెళ్లి బలవంతంగా ఆయన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో డొమ్లుర్ లోని కర్నాటక గోల్ఫ్ అసోసియేషన్ వద్ద ఉండగా… ఇంట్లో మా నాన్న రక్తపు మడుగులో పడి ఉన్నాడని నాకు సమాచారం వచ్చింది అని కార్తికేశ్ తెలిపారు. ‘అక్కడికి వెళ్లే సరికి తల, శరీరంపై తీవ్ర గాయాలతో పడి ఉన్నారు. పక్కనే పగిలిన సీసా, కత్తి పడి ఉన్నాయి. తర్వాత ఆయన్ను సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు అని వివరించారు. నాన్నతో అమ్మ పల్లవి, సోదరి కృతి తరచూ గొడవపడుతున్నారు. ఆయన హత్యలో వీరిద్దరిపైనే నాకు ఎక్కువ అనుమానాలున్నాయి. వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి’అని ఆయన పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read : JD Vance: భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై మోదీ, వాన్స్ భేటీ