AP SSC Results: ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల
AP SSC Results : విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ 10వ తరగతి ఫలితాలను(AP SSC Results) విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా… తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అనంతరం ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు కేవలం ఏడు రోజుల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష మూల్యాంకనం ముగించి త్వరిత గతిన ఫలితాల విడుదల చేశారు. పదవ తరగతి ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లేదా https://results.bse.ap.gov.in/ లేదా మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
AP SSC Results – మన్యం జిల్లా అగ్రస్థానం ! అల్లూరి జిల్లా చివరి స్థానం !
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వారిలో 4,98,585 మంది పాసైనట్లు మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో 93.90 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో ఉండగా… అల్లూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది. బాలికల్లో 84.09 శాతం, బాలురలో 78.31 శాతం పాసయ్యారు. 1,680 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. మే 19 నుంచి 28 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.
టెన్త్ ఫలితాల్లో 600/600 మార్కులు సాధించిన కాకినాడ విద్యార్థిని
ఏపీ టెన్త్ ఫలితాల్లో ఓ విద్యార్థిని అరుదైన ఘనత సాధించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే బాలికకు 600/600 మార్కులు వచ్చాయి. నగరంలోని భాష్యం పాఠశాలలో నేహాంజని చదువుతోంది. మరోవైపు ఎలమంచిలి శ్రీచైతన్య స్కూల్లో చదువుతున్న ఎండ అనీష అనే విద్యార్థిని 599 మార్కులు సాధించింది. పల్నాడు జిల్లాలో ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న పావని చంద్రిక అనే విద్యార్థినికి 598 మార్కులు వచ్చాయి. ఆమెను హెచ్ఎం విజయ లలిత, తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.
Also Read : CM Revanth Reddy: పరువు నష్టం దావా కేసులో హైకోర్టును ఆశ్రయించిన సీఎం రేవంత్ రెడ్డి