MLC Kavitha: కేసీఆర్‌ ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్‌ – ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్‌ ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్‌ - ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : రాజకీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR) కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్‌ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్‌ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్‌ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. ఆయనకు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లే అని పేర్కొన్నారు. తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడమే కేసీఆర్‌ చేసిన తప్పా అని నిలదీశారు. అయితే ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉన్నారు.

MLC Kavitha Comments

‘‘అది కాళేశ్వరం కమిషన్‌ కాదు.. అది కాంగ్రెస్‌ కమిషన్‌, రాజకీయ కమిషన్‌. కాళేశ్వరం పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుంది. కేసీఆర్‌ ది గట్టి గుండె కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు నిర్మించారు. కాంగ్రెస్ కలలో కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టలేదని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మూడు బ్యారేజులు కాదని.. 21పంపు హౌస్‌లు, కాళేశ్వరంతో 35శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరం కమిషన్‌ వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మేడిగడ్డకు చిన్న చిన్న మరమ్మతులు కూడా చేయట్లేదు. తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి స్పందించట్లేదు. గోదావరి-పెన్నా అనుసంధానం పేరిట నీళ్ల తరలింపును అడ్డుకోవాలి. బీజేపీలో ఉన్న తెలంగాణ బిడ్డ ఈటల రాజేందర్‌ కూడా మాట్లాడకపోవడం శోచనీయం. గోదావరి-బనకచర్లను ఆపే బాధ్యతను ఆయన తీసుకోవాలి. కాళేశ్వరానికి జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల తీసుకోవాలి’’ అని కవిత అన్నారు.

నీళ్లు ఇచ్చిన కేసీఆర్‌కు… రేవంత్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని సహించమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి తన‌ గురువు చంద్రబాబు ఏపీకి గోదావరి జలాలను తరలించుకుపోతుంటే… మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను ఆపమని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే ధైర్యం రేవంత్‌రెడ్డికి లేదా అని నిలదీశారు. వెంటనే రేవంత్‌రెడ్డి.. ‌అపెక్స్ కౌన్సిల్, కేంద్రానికి‌ లేఖ రాయాలని కోరారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు‌లు కట్టినప్పుడు చిన్న సమస్యలు సాధారణమేనని తెలిపారు. కుంగిన‌ మేడిగడ్డ పిల్లర్‌కు రిపేర్ చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. పర్మిషన్ ఉన్నప్పటికీ.. జాగృతి దర్నాకు పోలీసులు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ప్రశ్నించారు. బైండోవర్ పేరుతో అరెస్టులు చేయటాన్ని ఆపాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

Also Read : Ganta Srinivasa Rao Slams : మాజీ సీఎం జగన్, వెన్నుపోటు, కత్తి పోటుకు బ్రాండ్ అంబాసిడర్

Leave A Reply

Your Email Id will not be published!