Bengaluru Stampede: సీఐడీ చేతికి బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు
సీఐడీ చేతికి బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ… బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్, ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ సహా పలువురు కీలక పోలీసు అధికారులను బదిలీ చేశారు. మరో వైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజన్ను పదవి నుంచి తొలగించారు. అయితే ఈ కేసును క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం శనివారం ఆదేశించింది. దీనితో రంగంలోకి దిగిన సీఐడీ టీమ్… కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యాలయానికి వెళ్లి ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. కాగా, చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు శనివారంనాడు రాజీనామా చేసారు. బోర్డు ప్రెసిడెంట్ రఘరామ్ భట్కు తమ రాజీనామా పత్రాలను అందజేశారు.
చిన్నస్వామి స్టేడియంలో ఈవెంట్ నిర్వహణకు ఆర్సీబీని తాము అనుమతించ లేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఆర్సీబీని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీనితో పాటు ఫ్రాంచైజ్ ఈవెంట్ పార్టనర్ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, స్టేడియం కంట్రోల్ బాధ్యతలపై కేఎస్సీఏ పేర్లు కూడా చేర్చారు. ఈ కేసులో అరెస్టు చేసిన నలుగురిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. వీరిలో ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే కూడా ఉన్నారు. తొక్కిసలాట ఘటన అనంతరం కుబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమైదింది. దీనిపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ మైఖేల్ సారథ్యంలో ఏక సభ్య దర్యాప్తు కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు, ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకుని స్థాయీ నివేదికను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జూన్ 10న కేసు విచారణను చేపట్టనుంది.
పోలీసుల వాదన వినకుండా చర్యలా – తొక్కిసలాట ఘటనపై కిరణ్ బేడీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవం సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానందను బదిలీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బి.దయానంద్ బదిలీని పోలీస్ అసోసియేషన్ ఇప్పటికే తీవ్రంగా ఖండించింది. దీనిపై మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ స్పందించారు. అసోసియేషన్ అభిప్రాయాన్ని కిరణ్ బేడి సమర్థిస్తూ, ప్రతి కేసులోనూ శాంతిభద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్ను మాత్రమే బాధ్యులను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. ఇందువల్ల పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని చెప్పారు.
క్రౌడ్ మేనేజ్మెంట్లో ఎవరి పాత్ర ఏమిటనేది స్టేడియం వెలుపల గుమిగూడిన జనాలను కూడా తెలియదని కిరణ్ బేడీ అన్నారు. భద్రతా చర్చల్లో పోలీసు యంత్రాంగం, సెక్రటేరియట్, రాజకీయ నాయకత్వం పాత్ర ఉందని… కమిషనర్ (దయానంద్) ఒక్కరే ఇందుకు బాధ్యులు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవస్థలో పోలీసు కమిషనర్ ఒక భాగమని, ఒకవేళ సమస్య ఎదురైతే ఆయన కూడా సమస్యలో ఓ భాగమే కానీ సమస్య పరిష్కారం కోసం ఆయననే తొలగించడం సమర్ధనీయం కాదని కిరణ్ బేడీ అన్నారు. అధికారులు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు పోలీసుల వాదన కూడా వినాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు నివారించడానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు పోలీసులతో చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతా బాగా జరిగినప్పుడు తమ గొప్పదనంగా చెప్పుకునే అధికారులు… తప్పు జరిగినప్పుడు మాత్రం పోలీసులను బలిపశువులను చేస్తున్నారని ఆమె విమర్శించారు.
ఈ విషయంపై బెంగళూరు మాజీ పోలీసు కమిషనర్ భాస్కర్ రావు మాట్లాడుతూ… దయానంద లాంటి పోలీసు అధికారిని తొలగించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం కోసం ఆయన ముందు రోజు రాత్రంతా నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ… బాధ్యతగా విధులు నిర్వహించారని అన్నారు. అందుకు బదులుగా సిద్ధరామయ్య ప్రభుత్వం ఆయనను బదిలీ చేసిందని విమర్శించారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.