Manipur: మణిపూర్ లో మళ్ళీ ఘర్షణలు ! సామూహిక ఆత్మాహుతికి మైతేయి యువకులు సిద్ధం !

మణిపూర్ లో మళ్ళీ ఘర్షణలు ! సామూహిక ఆత్మాహుతికి మైతేయి యువకులు సిద్ధం !

 

 

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో మళ్లీ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. మొయితీ వర్గం నాయకులను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడంతో…. ఆ వర్గం ప్రజలు రోడ్లెక్కారు. రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలతో హోరెత్తించారు. కొన్ని చోట్ల పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దీనితో ఇంఫాల్‌ వెస్ట్, ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు. దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

 

ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు, సీబీఐ అరెస్టు చేసిన అరంబాయ్‌ టెంగోల్‌(ఏటీ) నేత కరణ్‌ సింగ్‌ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో సామూహికంగా ఆత్మాహుతి చేసుకుంటామంటూ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో మైతేయీ యువకులు ఆందోళన చేపట్టారు. ఇంఫాల్‌ లో రోడ్లపై టైర్లను తగులబెట్టి, రాస్తారోకో చేశారు. అనంతరం కొందరు యువకులు తమ తలలపై పెట్రోల్‌ చల్లుకుని, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఇంఫాల్‌ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్‌ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది.

 

హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసే కరణ్‌సింగ్‌ అదనపు ఎస్పీ మొయిరింగ్‌థమ్‌ అమిత్‌ ఇంటిపై దాడి చేసి, అతణ్ని అపహరించిన కేసులో నిందితుడు. ప్రభుత్వం కరణ్‌ సింగ్‌ను సస్పెండ్‌ చేయడంతో… అరంబాయ్‌ టెంగోల్‌ లో చేరారు. కరణ్‌సింగ్‌ ను తొలుత భద్రతాబలగాలు అరెస్టు చేయగా… ఆ తర్వాత సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా ఇంఫాల్‌(తూర్పు), ఇంఫాల్‌(పశ్చిమం), బిష్ణుపూర్‌, థౌబల్‌, కాక్చింగ్‌ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది.

 

మరోవైపు మణిపూర్‌ గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్‌లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్‌ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మైతేయి వర్గానికి చెందిన అరంబాయ్‌ తెంగోల్‌ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్‌ సింగ్‌ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్‌లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్‌సింగ్‌ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!