CM Devendra Fadnavis: రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్
రాహుల్ ‘ఫిక్సింగ్’ వ్యాసానికి సీఎం ఫడ్నవీస్ కౌంటర్ ఆర్టికల్
మహారాష్ట్ర ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతిని, ప్రజల తీర్పును రాహుల్ ఎప్పుడూ అవమానిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఆయన ఆదివారం ఓ పత్రికకు రాసిన వ్యాసంలో… ‘‘ప్రజలు రాహుల్ను తిరస్కరించారు. దీనికి ప్రతీకారంగా ఆయన ప్రజా తీర్పునే అంగీకరించడం లేదు. దీనికంటే ఓటమిని అంగీకరించి ఎక్కడ తప్పు జరిగింది? ప్రజలతో సంబంధాలు ఎక్కడ లోపించాయి? దాని గురించి మనం ఏం చేయాలి? అన్న విషయాలపై సమీక్షించుకోవడం తెలివైన పని. బిహార్ సహా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలకు సిద్ధమై ఇప్పటి నుంచే ఆయన సాకులు వెతుక్కుంటున్నారు. ఒక్కసారిగా ఓటర్ల జాబితా పెరిగిపోయిందన్న ఆరోపణలు హాస్యాస్పదం. సాయంత్రం 5 నుంచి 6 గంటలు కూడా ఓటింగు సమయాలే అన్న విషయం రాహుల్కు తెలుసా?’’ అని ఫడణవీస్ వ్యాసంలో ప్రశ్నలు సంధించారు.
‘‘ఓటింగ్ శాతం పెరిగిపోయిందని రాహుల్ గాంధీ ఒక్క కమఠీ నియోజకవర్గానికి సంబంధించిన ఉదాహరణనే ఇచ్చారు. మిగిలిన వాటి గురించి నేను చెప్తాను. శరద్ పవార్ అభ్యర్థి గెలిచిన మాఢాలో 18 శాతం, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన అభ్యర్థి విజయం సాధించిన వణీలో 13 శాతం, కాంగ్రెస్ విజయం సాధించిన శ్రీరామ్నగర్ లో సాయంత్రం 5- 6 గంటల్లో 12 శాతం ఓటింగ్ పెరిగింది. ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ సంస్థలపై నిరంతరం సందేహాలను లేవనెత్తడం ద్వారా ఆయన దేశాన్ని ఏ మార్గంలో తీసుకువెళ్తున్నారో, ఎంత విషాన్ని వ్యాప్తి చేస్తున్నారో గుర్తించాలి’’ అని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్..ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది.
అసలేం జరిగిందంటే ?
2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రముఖ పత్రికలో వ్యాసం రాశారు. దీనిపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, రాహుల్ ఆర్టికల్కు కౌంటర్గా మరో పత్రికలో వ్యాసం రాశారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లోని శరద్ పవార్ వర్గం, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గాల కూటమి ఊహించని ఓటమిని చవిచూసిందని పేర్కొంటూ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధానాన్ని రాహుల్ గాంధీ తప్పుపట్టారు. దీనిపై ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో వ్యాసం రాశారు.
దీనికి కౌంటర్గా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన వ్యాసం ఆదివారం ఒక మరాఠీ దినపత్రికలో ప్రచురితమయ్యింది. దానిలో ఫడ్నవీస్ కాంగ్రెస్ను ప్రజలు తిరస్కరించారని, అందుకే వారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)లను తప్పుబడుతూ, ప్రజాస్వామ్య ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తడం ప్రతిపక్ష పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. రాహుల్ గాంధీ వైఫల్యాన్ని అంగీకరించలేని నేత అని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు సరైనవేనా? అంటూ ఫడ్నవీస్ ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎన్సీపీలోని శరద్ పవార్ వర్గం, ఉద్ధవ్ థాకరే శివసేనల మహా వికాస్ అఘాడి కూటమి నవంబర్ 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 46 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అప్పటి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీల మహాయుతి కూటమి 235 సీట్లను గెలుచుకుంది. బీజేపీ ఒంటరిగా 132 సీట్లను గెలుచుకుంది. ఇది రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలిచింది.