MLC Kodandaram: బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు
బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎమ్మెల్సీ కోదండరాం కీలక వ్యాఖ్యలు
MLC Kodandaram : తెలంగాణ ప్రయోజనాలను బచావత్ ట్రిబ్యునల్ విస్మరించిందని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం ఆరోపించారు. బనకచర్ల ద్వారా రెండు వందల టీఎంసీలు మాత్రమే అని చెప్పినా… 300 టీఎంసీలు తరలించుకెళ్లే అవకాశం ఉందని తెలిపారు. శుక్రవారం టీజేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు మౌనం వహిస్తున్నారని మండపడ్డారు. బనకచర్ల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్న కోదండరాం… పెండింగ్లో ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్లకు నీటి కేటాయింపులు చేయాలని తెలిపారు. గోదావరిలో తెలంగాణ వాటాను కేంద్ర ప్రభుత్వం తేల్చాలని ఆయన స్పష్టం చేసారు.
MLC Kodandaram Key Comments
తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడకపోతే ఈ అన్యాయంలో వారికి వాటా ఉన్నట్లే అవుతుందని ఎమ్మెల్సీ కోదండరాం (MLC Kodandaram) అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగితే… చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలంగాణ నీటి వాటా తేల్చాలి కానీ… వెయ్యి టీఎంసీలు చాలనేది అ సందర్భపు మాటలని ఎమ్మెల్సీ కోదండరాం చెప్పారు. బనకచర్ల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ముందు తెలంగాణకు ఉన్న నీటి హక్కులు కాపాడుకోవాలని సూచించారు. తర్వాత నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడకు తరలించాలనే టెక్నికల్ అంశాలు వస్తాయని చెప్పారు. ఐదేళ్లలో కాళేశ్వరం ద్వారా వంద టీఎంసీలు కూడా వినియోగించుకోలేదని అన్నారు. తుమ్మిడిహెట్టి కూడా కడతామని తనకు కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారని కోదండరాం పేర్కొన్నారు.
Also Read : Voter ID: ఇక నుండి 15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డు
