Chhattisgarh: గిరిజన బాలికల మత మార్పిడికి ప్రయత్నించిన ఇద్దరు నన్ల అరెస్టు
గిరిజన బాలికల మత మార్పిడికి ప్రయత్నించిన ఇద్దరు నన్ల అరెస్టు
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్లో ఇద్దరు క్రైస్తవ సన్యాసిను (నన్)ల అరెస్టుపై రాజకీయ దుమారం రేగుతోంది. వారు గిరిజన బాలికల మత మార్పిళ్లకు, మహిళల అక్రమ రవాణాకు పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుండగా… నన్ల అరెస్టు మైనారిటీలపై దాడేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండు చేశారు. సీపీఎం కూడా అరెస్టును ఖండించింది. ఈ కేసు కోర్టు పరిధిలో ఉందని, దర్యాప్తు జరుగుతోందని ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ స్పష్టం చేశారు.
నారాయణ్పుర్కు చెందిన ముగ్గురు గిరిజన బాలికలను ఓ స్థానిక వ్యక్తి… ఈ నెల 25వ తేదీన దుర్గ్ రైల్వే స్టేషన్వద్ద ప్రీతి మేరీ, వందనా ఫ్రాన్సిస్ అనే ఇద్దరు నన్లకు అప్పగించాడు. ఈ సమాచారం తెలుసుకున్న బజరంగ్దళ్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరిజన బాలికలను బలవంతపు మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తున్నారని, వారికి నర్సు శిక్షణ, ఉద్యోగాల పేరుతో ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాకు తరలించేందుకు నన్లు ప్రయత్నించారని ఆరోపించారు. బాలికలను మభ్యపెట్టి తరలిస్తున్నారని ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీనితో ఇద్దరు నన్లతోపాటు సుకమన్ మాండవీ అనే వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
Chhattisgarh – మత మార్పిడుల కుట్రే – సీఎం
ఇదో తీవ్రమైన అంశమని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయ్ సోమవారం స్పష్టం చేశారు. మహిళల అక్రమ రవాణా, మత మార్పిడుల కుట్రని ఆరోపించారు. పరిస్థితిని తమ ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని, మహిళల భద్రతపై దృష్టి సారించిందని తెలిపారు. బస్తర్ ఆడబిడ్డలు… రాష్ట్ర సంస్కృతికి, గుర్తింపునకు గర్వకారణమని వ్యాఖ్యానించారు.
Also Read : Terrorist Suleman: ‘ఆపరేషన్ మహాదేవ్’ లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం
