CM Chandrababu: దీపావళి వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
దీపావళి వేళ వ్యాపారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
CM Chandrababu : దీపావళి పండగ వేళ వ్యాపారులు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గుడ్ న్యూస్ చెప్పారు. పరిశ్రమలకు మద్దతుగా, వ్యాపారాలకు ఏపీని గమ్య స్థానంగా నిలిపేందుకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. పరిశ్రమలకు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రగతిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలన్న లక్ష్యంతో…ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలివిడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్ సెంటర్ విశాఖలో ఏర్పాటు ప్రభుత్వం, గూగుల్ ప్రతినిధుల మధ్య ఒప్పందం చేసుకున్నామన్నారు. రాష్ట్రాభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
CM Chandrababu – తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు దీపావళి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీపావళి ప్రాశస్త్యాన్ని తెలియచెబుతూ సీఎం చంద్రబాబు, రాష్ట్రం ప్రగతి పథంలో ప్రకాశించాలని ఆకాంక్షించారు. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే || పరబ్రహ్మగా భావించే దీపాన్ని ఆరాధించే పవిత్ర దినం అయిన దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. లోకాన్ని పీడిస్తున్న నరకాసురుడు అనే రాక్షసుడిని శ్రీకృష్ణ, సత్యభామ కలిసి వధించిన రోజు ఇది. దీపావళి అంటేనే చీకట్లను పారద్రోలి వెలుగులు తీసుకువచ్చే పండుగ. ఈ దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని.. రాష్ట్రం ప్రగతితో ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
నయా నరకాసురులకు బుద్ధి చెప్పండి – పవన్ కల్యాణ్ దీపావళి సందేశం
జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘దీప కాంతులతో శోభాయమానంగా… సంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పండగ దీపావళి. తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. మన భారతదేశంలో చేసుకునే ప్రతీ పండగకీ ఒక పరమార్థం ఉంది. మనకు జీవన శైలిని నేర్పుతుంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని నిర్వహించుకుంటాం. దీపావళి స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలందరూ కలసి ఓడించారు. ఈ నరకాసురులు మారీచుల్లాంటివారు. రూపాలు మార్చుకొంటూ- తమను ఓడించారనే అక్కసుతో.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, అశాంతి రేకెత్తించే కుట్రలకు దిగుతున్నారు.
కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి నయా నరకాసురులకు, వారి అనుచర గణానికి ఎప్పటికప్పుడు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. ఈ వేడుకల్లో టపాసులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీపావళిని పర్యావరణహితంగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ తన దీపావళి సందేశంలో పేర్కొన్నారు.
Also Read : Nizamabad Police: కానిస్టేబుల్ హత్యకేసు నిందితుడు రియాజ్ అరెస్ట్
