YS Jagan: వైఎస్ జగన్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
వైఎస్ జగన్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. దీపావళి వేడుకల్లో వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి బాణాసంచా కాల్చారు. దీపావళి వేడుకలు సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ప్రత్యేక దీపాల అలంకరణ చేశారు.
దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎక్స్ ద్వారా వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘చీకటిని జయించిన వెలుగుల పండుగ దీపావళి. అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే ఈ దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
అంబరాన్ని అంటుతున్న దీపావళి సంబరాలు
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దీపావళి వేళ లక్ష్మీదేవికి పూజ చేసిన హిందూ సోదరులు సోమవారం సాయంత్రం నుంచీ టపాసులు పేలుస్తూ సందడి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ వంటి ప్రధాన నగరాల్లో టపాసుల మోత మోగిపోతోంది. రెండ్రుజులుగా బాణసంచా దుకాణాలు కిక్కిరిపోతున్నాయి. ఖర్చు ఎంతైనా తగ్గకుండా భారీగా టపాసులు కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. దేశంలోని వీధులన్నీ చిన్నాపెద్ద అని తేడా లేకుండా నిండిపోయాయి. అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ దీపావళి వేడుకలు చేసుకుంటున్నారు. కాగా, తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
