DGP Shivadhar Reddy: తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బండి ప్రకాశ్‌ సరెండర్‌

DGP Shivadhar Reddy : మావోయిస్ట్ పార్టీ కీలక నేత బండి ప్రకాష్ తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) సమక్షంలో లొంగిపోయారు. ఆశన్న లొంగుబాటు సమయంలోనే ప్రకాశ్‌ కూడా లొంగిపోతారనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌, అశోక్‌, క్రాంతి… స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి. ప్రకాశ్‌ తండ్రి సింగరేణి కార్మికుడు. 1982–84 మధ్య గో టు ద విలేజెస్‌ ఉద్యమం ద్వారా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ (Maoist) పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా, అక్కడి నుంచి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. అనారోగ్య కారణాలతో ఆయన లొంగిపోయారని తెలుస్తోంది.

మావోయిస్టులు లొంగిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) తాజాగా పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు లొంగిపోయారని.. మిగతా వాళ్లు కూడా జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగం కావాలని కోరారాయన. అదే సమయంలో.. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ ప్రభావంతో ఆ పార్టీ కీలక సభ్యులు తమ దళాలతో వరుసగా లొంగిపోతున్నారు. మావోయిస్ట్ పార్టీ లో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాశ్‌. గత 45 ఏళ్లుగా వివిధ స్థాయిల్లో పని చేసిన ఆయన లొంగిపోవడం.. ఆ పార్టీకి భారీ దెబ్బే అని చెప్పొచ్చు.

DGP Shivadhar Reddy – లొంగిపోయిన మావోయిస్టు నేతలపై చర్యలు ఉండవు – డీజీపీ శివధర్‌రెడ్డి

పోలీసుల ఎదుట లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులపై ఎలాంటి చర్యలు ఉండవని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) స్పష్టం చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ ప్రకాశ్‌తో కలిసి మరో కీలక నేత పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టుల లొంగుబాటు వివరాలను డీజీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘1980లో పుల్లూరి ప్రసాదరావు కిషన్‌జీకి అనుచరుడిగా మారారు. 1981లో పీపుల్స్‌వార్‌లో చేరి.. 1983లో కమాండర్‌ అయ్యారు. 1992లో ఆదిలాబాద్‌ జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. 2008లో మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడయ్యారు. 17 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో పుల్లూరి ప్రసాదరావు లొంగిపోయారు’’ అని డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) తెలిపారు.

‘‘మావోయిస్టు మరో నేత బండ ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌.. 45 ఏళ్లు వివిధ స్థాయిల్లో పనిచేశారు. అతని స్వస్థలం తెలంగాణలోని మందమర్రి. ఏడో తరగతి చదువుతున్నప్పుడే నక్సలిజం వైపు ఆకర్షితులయ్యారు. 2004లో జరిగిన శాంతి చర్చల్లో ప్రకాశ్‌ పాల్గొన్నారు. 2019లో స్టేట్‌ కమిటీ సభ్యుడయ్యారు. నేషనల్‌ పార్క్‌ ఏరియా కీలక ఆర్గనైజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. బండ ప్రకాశ్‌పై ఉన్న రూ.20లక్షల రివార్డు ఆయనకు ఇస్తాం. పుల్లూరి ప్రసాదరావుపై ఉన్న రూ.25లక్షల రివార్డు ఆయనకు ఇస్తాం. తెలంగాణకు చెందిన ఇంకా 64 మంది మావోయిస్టులు కొనసాగుతున్నారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు నేతలపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కరెక్ట్‌ కాదు. అవసరమైతే.. వారికి రక్షణ కల్పిస్తాం’’ అని డీజీపీ తెలిపారు.

DGP Shivadhar Reddy – మావోయిస్టు పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ

హైదరాబాద్‌ మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ ఐడియాలజీని నిర్మించిన పుల్లూరు ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న లొంగిపోయారు. తెలంగాణ ఎస్‌ఐబీ (ప్రత్యేక ఇంటెలిజెన్స్ బ్యూరో) చేపట్టిన కీలక ఆపరేషన్‌లో మావోయిస్టు చంద్రన్న లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న సైతం లొంగిపోవడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. చంద్రన్నది తెలంగాణ రాష్ట్రంలో పెదపల్లి జిల్లాలోని ఎడ్కాపూర్‌ గ్రామం. ఈ ఏడాది మే నెలలో బీజాపూర్‌ కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌లో చంద్రన్న మృతిచెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ ఆ ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకన్నారు. తాజాగా తెలంగాణ ఎస్‌ఐబీ చేపట్టిన కీలక ఆపరేషన్‌లో చంద్రన్న లొంగిపోయారు.

ఈ మేరకు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి (GDP Shivadhar Reddy) మాట్లాడుతూ.. ‘ ఈ ఏడాది తెలంగాణలో 427 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు మేరకు చంద్రన్న లొంగిపోయారు. చంద్రన్నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. చంద్రన్న కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా పనిచేశారు. తెలంగాణ నుంచి 64 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వారంతా అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలి’ అని పేర్కొన్నారు.

DGP Shivadhar Reddy – ‘డీప్‌ఫేక్’ నుంచి ‘సేఫ్‌ వర్డ్‌’ రక్షణ – సీపీ సజ్జన్నార్‌

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ మోసాలు అధికం అయిపోయాయని, ముఖ్యంగా ఏఐ, డీప్‌ ఫేక్‌ క్లోనింగ్‌లతో ఆధునిక తరహా మోసాలు జరుగుతున్నాయని, వీటి నివారణకు ‘సేఫ్‌ వర్డ్‌’తో రక్షణ పొందాలని హైదరాబాద్‌ నగర సీపీ సజ్జన్నార్‌ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. తెలంగాణలో డీప్‌ ఫేక్‌, సైబర్ మోసాల కేసులు విపరీతంగా పెరుగుతున్నందున, వీటి బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన పరిచయస్తుల నడుమ‘సురక్షిత పదం’ (సేఫ్‌ వర్డ్‌)ను ఉపయోగించాలన్నారు. మంగళవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో నగర సీపీ సజ్జన్నార్‌..ఏఐ సాధనాలు ఇప్పుడు ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో ముఖాలు, గొంతులను క్లోనింగ్ చేయగలవన్నారు. దీంతో మోసగాళ్లు మన స్నేహితులు, సహోద్యోగులు లేదా అధికారుల మాదిరిగా కూడా నటించగలరని సజ్జనార్ హెచ్చరించారు. ఏఐ,డీప్‌ఫేక్‌ల యుగంలో ‘సురక్షిత పదం’ బలమైన రక్షణగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు, నమ్మకమైన పరిచయస్తులతో ఒక ప్రత్యేకమైన భద్రతా పదాన్ని రూపొందించుకోవాలి, వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని పంచుకునే ముందు దానిని ఉపయోగించి, ఏవైనా అనుమానాస్పద కాల్‌లు లేదా సందేశాలను ధృవీకరించాలని ఆయన సూచించారు. డీప్‌ఫేక్ అనుకరణలకు సంబంధించిన సైబర్ ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్నాయని సజ్జన్నార్‌ పేర్కొన్నారు. స్కామర్లు క్లోన్ చేసిన వాయిస్‌లు, వీడియోలను ఉపయోగించి డబ్బు లేదా సున్నితమైన డేటాను అత్యవసరంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. అందుకే అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రజల మధ్య డిజిటల్ అక్షరాస్యత ప్రచారాలను సైబర్ క్రైమ్ యూనిట్లు ముమ్మరం చేశాయి.

Also Read : Justice Surya Kant: నూతన సీజేఐగా జస్టిస్‌ సూర్యకాంత్‌ ?

Leave A Reply

Your Email Id will not be published!