Amit Shah: చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం – అమిత్షా
చొరబాటుదారుల కారిడార్ నిర్మించడమే ప్రతిపక్షాల లక్ష్యం - అమిత్షా
బిహార్లో ప్రధాని మోదీ పారిశ్రామిక నడవా నిర్మించాలని అనుకుంటుంటే కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు మాత్రం చొరబాటుదారుల కారిడార్ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాసారాం, అర్వల్ పట్టణాల్లో ర్యాలీల్లో పాల్గొన్న ఆయన.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ‘ఇటీవల రాహుల్ గాంధీ, లాలూ కుమారుడు (తేజస్వి యాదవ్) బిహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టారు. దీని ప్రధాన లక్ష్యం చొరబాటుదారులను రక్షించడం. రాహుల్గాంధీకి నిజంగా ఓటు చోరీ జరుగుతున్నట్లు అనుమానాలుంటే నిబంధనల ప్రకారం ఫిర్యాదు ఎందుకు చేయడం లేదు? అధికార పీఠాలపై మన్మోహన్సింగ్, లాలూ ఉన్నప్పుడు ఈ దేశ గడ్డపై ఉగ్రదాడులు జరిగేవి. ఇప్పుడు ముష్కరుల ఇళ్లలోకి వెళ్లి మరీ మనం చితకబాదుతున్నాం. భవిష్యత్తులో భారత్పై దాడి చేయాలంటే వారు ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తయారైన మోటార్ షెల్సే వారి తూటాలకు దీటైన జవాబిస్తాయి’ అని అమిత్షా వ్యాఖ్యానించారు. అయోధ్య రామాలయంపై కాంగ్రెస్, ఆర్జేడీల వైఖరిని, దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ దోషిగా తేలడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
అద్వానీపై శశిథరూర్ ప్రశంసల జల్లు !
బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీకి శనివారం 98వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత శశి థరూర్… సంచలన వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘకాలం దేశానికి సేవలందించిన అద్వానీ వంటి నేత గుణగణాలను కేవలం ఒకే ఒక్క ఘటనతో నిర్థారించడం సరికాదంటూ అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, చైనాతో జరిగిన యుద్ధంలో ఓటమి కారణంగా అప్పటి ప్రధాని నెహ్రూను, దేశంలో అత్యవసర పరిస్థితి విధించినందుకు ఇందిరాగాంధీ వ్యక్తిత్వాన్ని లెక్కగట్టలేమని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయం, లాల్ కృష్ణ అద్వానీకి వర్తిస్తుందని తెలిపారు. అదెంత ప్రాముఖ్యం కలిగినదై నప్పటికీ కేవలం ఒకే ఒక్క పరిణామాన్ని ప్రాతిపదికగా తీసుకుని, వారి సుదీర్ఘ సేవలను బేరీజు వేయడం అన్యాయమన్నారు. అద్వానీ నిరాడంబరత, యోగ్యత, ఆధునిక భారత దేశ పథాన్ని నిర్ణయించడంలో ఆయన పాత్ర ఎవరూ కాదన లేనిదన్నారు. ఇక, 1990లో రామ జన్మభూమి ఉద్యమాన్ని దేశ వ్యాప్త రథయాత్రతో ముందుండి నడిపిన అద్వానీ, బీజేపీని జాతీయ రాజకీయాల్లో ప్రబల శక్తిగా తీర్చిదిద్దిన నేతగా ఖ్యాతి గడించారు.
మరోవైపు.. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఈ క్రమంలో.. అద్వానీని ప్రశంసిస్తూ శశిథరూర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పేర్కొంది. అవి ఆయన వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలే అని వివరణ ఇచ్చింది. ఇక, అద్వానీపై శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై పలు కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శశిథరూర్ వ్యాఖ్యలను ‘ఎక్స్’లోనే ఓ న్యాయవాది విమర్శించారు. రామజన్మభూమి ఉద్యమం సందర్భంగా రథయాత్రతో దేశంలో అద్వానీ విద్వేష బీజాలు నాటారని, ఆయన చేసింది ప్రజాసేవ కాదని పోస్టు చేశారు. దీనికి థరూర్ సమాధానమిస్తూ, ఒక్క ఘటనతో సుదీర్ఘకాలం పాటు ఆయన చేసిన సేవలను తక్కువ చేయడం సమంజసం కాదన్నారు.
