BRS Leaders: జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు
జూబ్లిహిల్స్ ఓటమిపై బీఆర్ఎస్ కేడర్ సంచలన ఆరోపణలు
BRS Leaders : ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS) ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్లో ఎన్నిక అనివార్యమవగా… సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గులాబీ పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. బీఆర్ఎస్ (BRS Leaders) అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను బరిలో నిలిపింది. సెంటిమెంట్తో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవాలని భావించినప్పటికీ ప్రజలు మాత్రం కాంగ్రెస్కే పట్టంకట్టారు. ఫలితంగా ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఉప ఎన్నికలో ఓటమికి కారణాలపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటమికి కారణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
BRS Leaders Shocking Comments
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బైపోల్స్లో ఓటమిపై కార్యకర్తల నుంచి కేటీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సొంత పార్టీ నాయకుల్లో కొందరు.. కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పలువురు కార్యకర్తలు ఆరోపించారు. సొంత పార్టీ నేతలు సరిగా పనిచేయకపోవడం వలనే బీఆర్ఎస్ ఓడిపోయిందని గులాబీ కార్యకర్తలు చెప్పుకొచ్చారు. స్థానిక నేతలు, జిల్లాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ నేతల మధ్య సమన్వయ లోపం కూడా ఓటమికి కారణమని నేతలకు చెప్పారు.
స్థానిక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ నేతలు బైపోల్స్ను పెద్దగా పట్టించుకోలేదని… నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలు కరువయ్యారని పార్టీ కార్యకర్తలు తెలిపారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ను ఎదుర్కోలేకపోవటం కూడా ఓటమికి కారణమని సమావేశంలో బీఆర్ఎస్ క్యాడర్ పేర్కొంది.
Also Read : Pakistan: భారత్ తో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి – పాక్ మంత్రి ఖవాజా
