Sabarimala: శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం
శబరిమలలో అన్నదాన సత్రంలో రోజూ 10 వేలమందికి ఆహారం
Sabarimala : కేరళలోని శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నారు. మలికప్పురం ఆలయం వెనుక ఉన్న ఈ సత్రంలో రోజు 10 వేలమందికిపైగా భక్తులకు మూడు పూటలా ఉచితంగా ఆహారం అందజేస్తున్నారు. ఇటీవల మండల- మకరవిలక్కు వార్షిక తీర్థయాత్ర ప్రారంభం కాగా.. ఇక్కడ భోజనం చేసినవారి సంఖ్య శనివారం నాటికి లక్ష దాటింది.
Sabarimala Annadanam Updates
శబరిమలలోని అన్నదాన సత్రం ఆసియాలోనే అతిపెద్ద అన్నదాన మండపాల్లో ఒకటి. ఒకేసారి వెయ్యిమందికిపైగా భక్తులకు వడ్డించే ఏర్పాట్లు ఉన్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి 11 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3.30 వరకు, సాయంత్రం 6.45 నుంచి ఆ రోజు ఆలయం మూసివేసే వరకు మూడు పూటలా ఆహారం అందజేస్తారు. వంటలు చేయడం, వడ్డించడం, క్లీనింగ్ కోసం 235 మంది సిబ్బందిని నియమించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ.. నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ వెల్లడించారు.
Also Read : Rajnath Singh: సింధ్ మళ్లీ భారత్లో కలవొచ్చు – రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్
