హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ బాస్ కేసీఆర్ నిప్పులు చెరిగారు . భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటుపై నోరు పారేసుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇంకోసారి తెలంగాణ రాష్ట్రం గురించి నోరు జారితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కాంగ్రెస్ సర్కార్ ను ఏకి పారేశారు. గతంలో ఎన్నడూ లేనంత జోష్ లో ఉన్నారు కేసీఆర్. ఇది చండాలమైన ప్రభుత్వం. ఇది చిల్లర ప్రభుత్వం… ఆ మాటలేంటి.. ఆ కూతలేంటి? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించే వాళ్లు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు దద్దమ్మలు. ఒక్కడు కూడా నోరు మెదపక పోవడం దారుణమన్నారు. తెలంగాణ ప్రజలు వీళ్లను క్షమించరని అన్నారు కేసీఆర్. సీఆర్ పాటిల్ కాలేశ్వరం గురించి మాట్లాడితే రాజ్యసభలో సురేష్ రెడ్డి గట్టిగా ఖండించారని గుర్తు చేశారు.
తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే… కాంగ్రెస్, బీజేపీ నేతలు మనుషులు కారా? ఎన్నో సందర్భాల్లో నన్ను మానసిక క్షోభకు గురిచేశారన్నారు. 2009లో చంద్రబాబుతో ‘జై తెలంగాణ’ అనిపించేందుకే అప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం అని చెప్పారు కేసీఆర్. అశోక్ గులాటీ అనే మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు రైతు బంధు పథకం తెచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారి పోయిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావడం లేదన్నారు. బొందల పడ్డట్టు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని అన్నారు కేసీఆర్. పక్క రాష్ట్రాల ప్రజలు అంబేద్కర్ విగ్రహాన్ని చూడడానికి వస్తుంటే ఈ ప్రభుత్వం గేట్లు తీయడం లేదన్నారు.
