హైదరాబాద్ : అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ వేడుక జరగడం ప్రత్యేకతగా నిలిచింది. వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ:
మోహన్ వడ్లపట్ల తన టీమ్తో కలిసి గొప్ప టాలెంట్ను తెరపై ప్రదర్శించారని ప్రశంసించారు. జో శర్మకు మంచి భవిష్యత్తు ఉందని తెలిపారు.
వి సముద్ర మాట్లాడుతూ 8న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు. మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకున్నారు. TFDA సెక్రటరీ పెండ్యాల మాట్లాడుతూ: M4M ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ కొత్తగా ఉందని చెప్పారు. ప్యాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తీసుకు రావడం అభినందనీయమన్నారు. నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమా 24 శాఖలను సమన్వయం చేస్తూ రూపొందించారని, టీమ్ ఎంతో కష్టపడి పనిచేసిందని తెలిపారు. కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నారు.
హీరోయిన్ జోశర్మ మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దర్శకుడు మోహన్ వడ్లపట్లకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పారు. ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయని వెల్లడించారు. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్ చేయాలని కోరారు.
