అమరావతి : ఏపీలో కొత్తగా 10 గురుకులాలను ఏర్పాటు చేస్తామని సంచలన ప్రకటన చేశారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. పీ 4 విధానం చాలా గొప్పదని, ఈ విధానంతో పేదరికం దూరం చేయొచ్చని తెలిపారు. సంపన్న వర్గాలు వారు తమ స్వస్థలాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పీ 4 విధానంలో వత్సవాయి ఎంజేపీ స్కూల్ ను అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు ఎందరో దాతలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వత్సవాయి ఎంజేపీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ కు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వత్సవాయి ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాలలో పీ-4 విధానంలో ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల రాంబాబు సాయంతో రూ.75 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, డార్మెటరీని మంత్రి ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు ఆశయాన్ని కొనసాగిస్తూ… పీ 4 విధానంలో రూ.75 లక్షలతో వత్సవాయి ఎంజేపీ స్కూల్ ను అభివృద్ధి చేసిన ఎన్ఆర్ఐ దంపతులను అభినందించారు. సంపన్న వర్గాల్లోని దాతలు ముందుకొచ్చి, తమ గ్రామాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ ఉందన్నారు. ఈ ఏడాది టెన్త్, ఇంటర్ లో ఎంజేపీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని, తమ కూటమి ప్రభుత్వానికి ఫొటోలు, ప్రచారం పిచ్చి లేదన్నారు ఎస్. సవిత. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటో తో విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా టెన్త్, ఇంటర్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది అత్యున్నతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు.
