డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి శస్త్ర చికిత్స

మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

ముంబై : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు శ‌నివారం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే ప‌వ‌న్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకుంటాన‌ని వైద్యుల‌కు తెలిపారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. ఇవాళ‌ నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.

ప‌వ‌న్ కళ్యాణ్ కి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసు కోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ కి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి.

Leave A Reply

Your Email Id will not be published!