ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు సీఎం ఎ.రేవంత్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ప్రసంగించారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని మరోసారి ఏకి పారేశారు. రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే.. ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిది అని అన్నారు సీఎం. 2023 జూలై లో పొంగులేటి చేరిక సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలు ఉప్పెనలా వచ్చి బీఆరెస్ ను బొంద పెట్టారంటూ ఎద్దేవా చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే జూలై లో బీఆరెస్ ను మళ్లీ మొలకెత్తనివ్వమని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటు నుంచి ప్రతీ ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వాన్ని గెలిపించి, పాపాల భైరవున్ని ఫామ్ హౌస్ లోనే బందీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జరగబోయే కురుక్షేత్రంలో కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు అని ప్రకటించారు రేవంత్ రెడ్డి. వచ్చే సాధారణ ఎన్నికలు 2028 డిసెంబరులో జరగవు అని అన్నారు. 2029 మే లేదా జూన్ మాసంలో జరుగుతాయని చెప్పారు. తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు 26 కు పెరుగుతాయని పేర్కొన్నారు. 119 అసెంబ్లీ స్థానాలు 182 కు పెరుగుతాయని ప్రకటించారు. 36 నెలల ముందుగానే వచ్చే ఎన్నికల ఫలితాల జోస్యం చెబుతున్నా. 182 అసెంబ్లీ స్థానాల్లో 117 సీట్లు గెలిచి రెండోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. భద్రాచలం రాములవారి మీద ఒట్టేసి చెబుతున్నానని, ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట అని అన్నారు.
