అమరావతి : ఎట్టకేలకు ఏపీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున రెస్క్యూ నిర్వహించారు. చివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖలోని 10 మంది మత్స్యకారులు సురక్షితంగా బయట పడ్డారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న చొరవను అభినందించక తప్పదు. చేపల వేట కోసం వెళ్లిన ఈ మత్స్యకారులు ఉన్నట్టుండి బోటులో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా కనిపించకుండా పోయారు. విషయం తెలిసిన వెంటనే సర్కార్ రంగంలోకి దిగింది. ఈ మేరకు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేవీ, రక్షణ, విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం, షిప్ యార్డు బాధ్యులు పెద్ద ఎత్తున ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు.
కాగా తప్పి పోయిన ఈ పది మంది మత్స్యకారులు పూరీ బీచ్ లో దొరికారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి గ్రామానికి చెందిన వీరంతా, నాలుగు రోజుల క్రితం కాకినాడ హార్బర్ నుండి యాంత్రిక చేపల వేట పడవలో వేటకు బయలు దేరారు. ఒడిశాలోని పూరీ తీరం వద్ద చిక్కుకు పోయిన మత్స్యకారులను స్థానిక మెరైన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. వారు ప్రయాణిస్తున్న పడవ ఇంజిన్ మధ్యలో మొరాయించింది. అప్పటికి వారు పూరీ తీరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయారు. వారు వెంటనే అక్కడి అధికారులకు సమాచారం అందించారు. పూరీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, బలియాపొండ, పెంటకోట మెరైన్ పోలీసులు ఆ మత్స్యకారుల వద్దకు చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. పడవ యజమాని దానయ్యతో పాటు మరో పది మందిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
