అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు నీటి పారుదల రంగానికి సంబంధించి. చివరి ఆయకట్టు భూముల వరకు సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పర్యటనలో భాగంగా రాజమండ్రి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు స్థానిక ప్రజా ప్రతనిధులు, ఉన్నతాధికారులు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను ప్రారంభించారు. 2014-19 మధ్య కాలంలో ధవళేశ్వరం బ్యారేజీకి 58 కొత్త గేట్లను అమర్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఇప్పుడు సీడబ్ల్యూసీ సూచనల మేరకు మిగిలిన 117 గేట్లకు కొత్త గేట్లను అమర్చే పనులకు శ్రీకారం చుట్టమాన్నారు.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు ముఖ్యమంత్రి. వచ్చే ఏడాది జూన్ నెలకు కొత్తగేట్ల బిగింపు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి సిద్దం చేస్తామని తెలిపారు నీటి పారుదల శాఖ అధికారులు. ప్రస్తుతం సముద్రంలోకి ఎంత నీరు వెళ్తోందని సీఎం చంద్రబాబు ఆరా తీశారు. కాగా ఇప్పుడు 27 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోందని వివరించారు. కాల్వలకు ఎన్ని క్యూసెక్కులు విడుదల చేశారని అడిగారు. 14,700 క్యూసెక్కుల నీరు కాల్వలకు వదిలామని చెప్పారు. కాల్వ చివరి భూములకూ నీరు అందేలా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇదిలా ఉండగా చివరి భూములకు నీరందేలా చూసే విషయంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. గోదావరి, కోనసీమ అందాల సీమ అని పేరుందని దానిని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలన్నారు.
