Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

 

 

ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) అభ్యర్థి వీణాదేవిపై గెలుపొందారు. అనంత్‌ సింగ్‌ ఇప్పటివరకు నాలుగుసార్లు మొకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవల మొకామా నియోజకవర్గంలో జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థిగా పీయూష్‌ ప్రియదర్శి ప్రచారం చేస్తుండగా..ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో పీయూష్‌ మామ, పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. దులార్‌ చంద్‌ హత్య నేపథ్యంలో అదే నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంత్‌ సింగ్‌పై పోలీసులు నిఘా ఉంచారు. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆయనపై 28 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

 

బిహార్ దంగల్ లో తమ్ముడి గెలుపు, అన్న ఓటమి

 

ఆర్జేడీ అగ్రనేత, ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్‌… రాఘోపుర్‌ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన బీజేపీ అభ్యర్థి సతీశ్‌ కుమార్‌పై 14,532 ఓట్ల తేడాతో నెగ్గారు. మహువా స్థానం నుంచి పోటీ చేసిన తేజస్వి సోదరుడు… జనశక్తి జనతాదళ్‌ అధ్యక్షుడు తేజ్‌ ప్రతాప్‌ మాత్రం పరాజయం పాలయ్యారు. ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ స్థానం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్‌) అభ్యర్థి సంజయ్‌ కుమార్‌ సింగ్‌… తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీకి చెందిన ముకేశ్‌ కుమార్‌పై 44,997 ఓట్లతో విజయం సాధించారు. బీజేపీ నుంచి గెలిచిన ప్రముఖుల్లో సామ్రాట్‌ చౌధరీ (తారాపుర్‌), విజయ్‌ కుమార్‌ సిన్హా (లఖిసరాయ్‌), మైథిలీ ఠాకూర్‌ (అలీ నగర్‌) ఉన్నారు. జేడీయూ నుంచి నెగ్గిన ముఖ్యుల్లో విజయ్‌కుమార్‌ చౌధరీ (సరాయ్‌రంజన్‌), శ్రావణ్‌ కుమార్‌ (నలంద), బిజేంద్ర ప్రసాద్‌ యాదవ్‌ (సుపౌల్‌) ఉన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!