Anmol Bishnoi: భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్

భారత్ కు గ్యాంగ్‌ స్టర్‌ అన్మోల్‌ బిష్ణోయ్

 

 

మహారాష్ట్ర ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో కీలక నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ అన్మోల్‌ బిష్ణో య్‌ను అమెరికా నుంచి రప్పిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద ఏప్రిల్‌ 2024లో జరిగిన కాల్పుల కేసులోనూ ఇతడు వాంటెడ్‌గా ఉన్నాడన్నారు. అమెరికా నుంచి ఇతడు బుధవారం ఢిల్లీకి చేరుకుంటాడని పోలీసులు వివరించారు. అన్మోల్‌ బిష్ణోయ్‌పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులున్నాయని, ముందుగా అతడిని ఎవరికి అప్పగించాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. తాము కూడా అతడి కస్టడీని కోరుతామన్నారు.

అమెరికా, కెనడా మధ్య రాకపోకలు సాగిస్తున్న అన్మోల్‌ బిష్ణోయ్‌ను ఇటీవల కెనడా అధికారులు అరెస్ట్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడి వద్ద ఫోర్జరీ చేసిన రష్యా పాస్‌పోర్టు ఉన్నట్లు సమాచారం. ఇతడి తలపై రూ.10 లక్షల రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది. 2022లో జరిగిన పంజాబ్‌ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులోనూ ఇతడి పేరు బయటకు వచ్చింది. 2024 అక్టోబర్‌ 12వ తేదీ రాత్రి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కుమారుడు జీషన్‌తో కలిసి ఉండగా మాజీ మంత్రి బాబా సిద్దిఖీని దుండగులు కాల్చి చంపడం తెల్సిందే.

అన్మోల్‌ బిష్ణోయ్‌ సోదరుడిని బహిష్కరించిన అమెరికా

 

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ ను అమెరికా మంగళవారం నాడు బహిష్కరించింది. గత ఏడాది ముంబైలో మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో అన్మోల్ ప్రధాన నిందితుడు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన సహా పలు కేసుల్లో అన్మోల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2022లో హత్యకు గురైన పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా కేసులోనూ అనుమానితుగా ఉన్నాడు. ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకడైన అన్మోల్‌ను గత ఫిబ్రవరిలో అమెరికాలో యూఎస్ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అరెస్టు చేసింది. దీంతో అతన్ని తమకు అప్పగించాలని భారత్ అమెరికాను కోరింది.

 

కాగా, అన్మోల్‌ను తమ దేశం నుంచి బహిష్కరించినట్టు బాబా సిద్ధిఖీ తనయుడు జీషాన్ సిద్ధిఖీకి అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా ఓ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది. 2025 నవంబర్ 18న ఫెడరల్ ప్రభుత్వం అమెరికా నుంచి అన్మోల్ బిష్ణోయ్‌ని బహిష్కరించినట్టు మెయిల్ ద్వారా సమాచారం ఇస్తున్నామని అందులో పేర్కొంది. ఈ మేరకు అన్మోల్ బిష్ణోయ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అతన్ని రప్పించేందుకు ఢిల్లీ, పంజాబ్, ముంబై, గుజరాత్ సహా పలు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర ఏజెన్సీలు చేసిన విస్తృత ప్రయత్నాలకు దక్కిన విజయంగా దీనిని చెప్పుకోవచ్చు. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేషన్లు అన్నీ అన్మోల్ నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.

 

Leave A Reply

Your Email Id will not be published!