AP Government: కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు

కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు

 

 

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం తుది దశకు చేరింది. అతి త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేయనున్నారు. జిల్లాల పునర్విభజన సమస్యల పరిష్కారంపై ఏర్పాటైన మంత్రి వర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించింది.

సీఎం చేసిన సూచనలు… మార్గదర్శకాల మేరకు ఆయా అంశాలపై సమగ్రంగా చర్చించారు. మదనపల్లి, మార్కాపురం కేంద్రాలుగా కొత్త జిల్లాలు చేయాలనే ప్రతిపాదనలకు ఇప్పటికే ఆమోద ముద్ర వేయగా.. మరిన్ని కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై లోతుగా చర్చించారు. 7-8 కొత్త జిల్లాలు కావాలని ప్రజల నుంచి వినతి పత్రాలు అందగా.. వాటిని పరిశీలించారు. మరీ చిన్న జిల్లాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉండదని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించి రూట్ మ్యాప్ ఖరారు చేశారు. కృష్ణా జిల్లాలోని నూజివీడు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదనలు, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపే ప్రతిపాదలపైనా చర్చించారు. రెవెన్యూ డివిజన్లు కావాలని ఎక్కువ వినతులు వచ్చాయన్నారు.

అల్లూరి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు 200-300 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తోందని… ఏఎస్‌ఆర్‌ జిల్లా అభివృద్ది కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలన్న సీఎం ఆదేశాలపై చర్చించామన్నారు. పోలవరం ముంపు మండలాలను ఎక్కడ కలపాలనే విషయంపైనా చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే మరో సమావేశం ఏర్పాటు చేసుకుని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై తుది నివేదిక రూపొందిస్తామన్నారు. సీఎంకు తుది నివేదిక ఇచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటారని మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, నాదెండ్ల మనోహర్‌, అనిత, బీసీ జనార్దన్‌ రెడ్డి, నిమ్మల రామానాయుడు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!