Upendra Dwivedi : డొనాల్డ్ ట్రంప్ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
డొనాల్డ్ ట్రంప్ పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Upendra Dwivedi : ప్రపంచ వ్యాప్తంగా ఇటీవల జరుగుతున్న ఘటనలను ఉద్దేశ్యించి భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. పాత సమస్యలు పరిష్కరించుకునే లోగా కొత్తవి ఎదురవుతున్నాయని చెప్పారు. భవిష్యత్లో ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరని, ట్రంప్ (Donald Trump) ఈ రోజు ఏమి చేస్తారో ? రేపు ఏమి చేయబోతున్నారో అతనే చెప్పలేరని ద్వివేది వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో అన్నింటా అనిశ్చితి పెరిగిపోయిందని, సైబర్ సవాళ్లు మరింత వేగవంతం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తన స్వస్థలం అయిన మధ్యప్రదేశ్లోని రేవాలో గల టిఆర్ఎస్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ… నేటి కాలంలో అనిశ్చితి సాధారణమైపోయిందని, భద్రత, సైబర్ యుద్ధం లాంటి సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ సవాళ్లు మరింత అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత , అస్పష్టతకు దారితీస్తాయని వ్యాఖ్యానించారు.
Upendra Dwivedi Slams Donald Trump
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో ఎవరూ ఊహిచలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏమి చేస్తారు? రేపు ఏమి చేయనున్నారు? అనేది అతనికే తెలియదని అనుకుంటున్నానన్నారు. సవాళ్లు చాలా త్వరగా వస్తున్నాయి. పాత సవాలును గ్రహించేలోపే, కొత్తది ఉద్భవిస్తోంది. దీనినే ఇప్పుడు సైన్యం ఎదుర్కొంటోంది. సరిహద్దుల్లో అయినా, ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ యుద్ధం అయినా సవాళ్లు వేగంగా చుట్టుముడుతున్నాయన్నారు. ఇప్పుడు కొత్తగా అంతరిక్ష యుద్ధం, ఉపగ్రహాలు, రసాయన, జీవ, రేడియోలాజికల్, సమాచార యుద్ధాలు మొదలయ్యాయని ద్వివేది పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్లో కరాచీపై దాడి జరిగిందంటూ అనేక వార్తలు వచ్చాయని, అవి తమకూ చేరాయని, అయితే అవి ఎక్కడి నుండి వచ్చాయో తమకు తెలియదన్నారు. ఇటువంటి సవాళ్ల పరిషర్కారానికి భూమి, ఆకాశం, నీరు.. ఈ మూడింటిపైనా పని చేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ ఉగ్రస్థావరాలపై దాడులు చేశామని, అయితే పౌరుల పైన దాడులు జరిపినట్టు తప్పుడు ప్రచారం జరిగిందని అన్నారు. ఈ వార్తలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు చేశారు? ఇలాంటి వాటిని కూడా సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్లాలని అన్నారు. ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి త్రివిద దళాలు సమష్టిగా పనిచేస్తున్నట్టు చెప్పారు.
Also Read : Rajasthan: రాజస్థాన్ లో మరో బస్సు ప్రమాదం ! 18 మంది దుర్మరణం !
