CM Revanth Reddy: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి – సీఎం రేవంత్
భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలి - సీఎం రేవంత్
CM Revanth Reddy : వరంగల్ నగరంలో చెరువులు, నాళాల కబ్జాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా వదలొద్దని హెచ్చరించారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్పై ఇరిగేషన్ శాఖ సంసిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖలు ఇరిగేషన్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం లేక సమస్యలు పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. చెరువుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లోపై లెక్కలు పక్కాగా ఉండాలని ఆదేశించారు. ఇవాళ(శుక్రవారం) వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్రెడ్డి.
CM Revanth Reddy Comments
నాళాల కబ్జాపై ఉక్కుపాదం మోపాలని సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఒక్కరి వల్ల వందల మంది ఆగం కావొద్దని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక ప్రణాళిక ఉండాలని ఆజ్ఞాపించారు. ఇసుక మేటలు వేసిన పొలాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద పనులు చేయాలని సూచించారు. ఇండ్లు కోల్పోయిన వాళ్ల లిస్ట్ సిద్ధం చేసి ఇండ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతోనే ముంపు తీవ్రత పెరిగిందని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి ఘటన జరుగకుండా చూసుకోవాలని, వరద ప్రభావంపై పూర్తి నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు విజిట్ చేయాలని హుకుం జారీ చేశారు సీఎం రేవంత్రెడ్డి.
వరంగల్లో నాలాలు, చెరువుల కబ్జాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వరంగల్లో మున్సిపల్, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయం ఎందుకు లేదని ప్రశ్నించారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆజ్ఞాపించారు. స్మార్ట్ సిటీ పథకంలో ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీలో చేయాల్సిన పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ఎక్కడా పనులు ఆపే ప్రసక్తి ఉండొద్దని ఆజ్ఞాపించారు. క్షేత్రస్థాయిలో ఒక కో-ఆర్డినేషన్ కమిటీ వేసుకుని పనిచేయాలని సూచించారు. వాతావరణ మార్పులతో క్లౌడ్ బరస్ట్ అనేది నిత్యకృత్యమైందని.. దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యం వదలండి.. క్షేత్రస్థాయికి వెళ్లాలని హుకుం జారీ చేశారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాల్సిందేనని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఎకరా పంట నష్టానికి రూ.10 వేలు పరిహారం
‘మొంథా’ తుపాను (Cyclone Montha) ప్రభావంతో తెలంగాణలోని 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని, ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చిన నివేదికలను కలెక్టర్లకు పంపాలన్నారు. అన్ని నివేదికలు సమీకరించి నిర్ణీత విధానంలో కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో వరదలపై సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. తుపాను నష్టాలపై కేంద్ర నిధులు రాబట్టుకోవాల్సి ఉందని, ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని అధికారులకు సూచించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. ధనిక రాష్ట్రమని కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వదులకునే ప్రసక్తే లేదన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందించాల్సిన ఆర్థిక సాయంపై గతంలో ఇచ్చిన జీవో ప్రకారం.. తాజా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్లు మునిగిన వారికి రూ.15వేల చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎకరా పంట నష్టానికి రూ.10వేలు చొప్పున, ఆవులు, గేదెలు మృత్యువాత పడితే రూ.50వేలు, మేకలు, గొర్రెలకు రూ.5వేలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
Also Read : Telangana Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
