హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది వాహనదారులకు. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడటానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చమురు సరఫరాను 126% పెంచింది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ వల్ల స్థానిక పెట్రోల్ బంకుల్లో తలెత్తిన రద్దీని తగ్గించడానికి అధికారులు ఈ వేగవంతమైన నిర్ణయం తీసుకున్నారు .పెట్రోల్ బంకుల దగ్గర ఇలా ఊహించని రద్దీ పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది పరిశ్రమలకు వాడే డీజిల్ ధరను ఇటీవల లీటరుకు రూ. 150 కు పెంచారు. దీంతో పెద్ద మొత్తంలో కొనే వ్యాపారులు, లీటరు రూ. 95 కే దొరుకుతున్న సాధారణ పబ్లిక్ పెట్రోల్ బంకులకు వచ్చి డీజిల్ కొంటున్నారు. రెండవది పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో సరఫరా సమస్యలు ఉన్నాయి. దీనివల్ల పక్క రాష్ట్రాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం ఖమ్మం, నిర్మల్ లాంటి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు క్యూ కడుతున్నారు. ఇక ఎన్నికల తర్వాత ధరలు పెరుగుతాయనే తప్పుడు పుకార్ల వల్ల సాధారణ ప్రజలు భయపడి, అవసరానికి మించి కొని దాచుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉన్న నిల్వలు వేగంగా అయిపోతున్నాయి.
ఈ సమస్యను పరిష్కరించడానికి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర పెట్రోల్, డీజిల్ కంపెనీలకు మార్కెట్లో సరిపడా నిల్వలు ఉంచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సరఫరాను వేగవంతం చేయడానికి, డీలర్ల నుంచి ముందుగానే ఆర్డర్లు తీసుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా 3,100 ఇంధన (ట్యాంకర్ల) వాహనాలను రంగంలోకి దించారు. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అయిపోక ముందే వాటికి ఇంధనం చేరేలా అధికారులు పర్యవేక్షణ పెంచారు. ప్రతి మూడు గంటలకోసారి బంకుల నుంచి నిల్వల వివరాలు తెప్పించు కోవడంతో పాటు, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ అందేలా చూడాలని కఠిన ఆదేశాలు ఇచ్చారు. దీనివల్ల పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లకు ఎలాంటి ఆటంకం కలగదు.
